వైఎస్సార్‌ సీపీ కార్యకర్తపై దాడి

TDP Leaders Attack On YSRCP Leaders In Guntur - Sakshi

15 మందిపై కేసు నమోదు

సాక్షి, నకరికల్లు: ఫేస్‌బుక్‌లో వార్తను షేర్‌ చేశాడనే అక్కసుతో వైఎస్సార్‌ సీపీకి చెందిన ఓ వ్యక్తిపై కొంత మంది టీడీపీ నాయకులు దాడి చేశారు. గాయాలపాలైన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీకి చెందిన సంగుల కొండలు అనే వ్యక్తి గత కొన్నాళ్లుగా స్థానిక చెరువు భూమిని ఆక్రమించుకున్నాడు. ఇదే విషయాన్ని నరసరావుపేట మున్సిపల్‌ అధికారులు వచ్చి చెరువు భూమిని వదలివెళ్లాలని హెచ్చరించారు.

విషయానికి సంబంధించి పత్రికలలో వార్తలు రాగా కొందరు ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఆ పోస్ట్‌ను స్థానిక పాతూరుకు చెందిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్త బాజి షేర్‌ చేశాడు. ఫేస్‌బుక్‌ పోస్ట్‌ను షేర్‌ చేశాడన్న అక్కసుతో కొండలు మరొక 14 మంది కలిసి తనపై దాడికి పాల్పడి గాయపర్చినట్లు బాధితుడు మర్రిపూడి బాజి పోలీసులను ఆశ్రయించాడు.  ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక పాతూరులో మళ్లీ అలాంటి అలజడులు జరుగకుండా పికెట్‌ ఏర్పాటు   చేసినట్లు ఎస్‌ఐ ఏ.నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top