జగనన్న వచ్చాడు.. ఉద్యోగాలు తెచ్చాడు | Students Rally On Created Jobs Of Village Secretary In AP | Sakshi
Sakshi News home page

జగనన్న వచ్చాడు.. ఉద్యోగాలు తెచ్చాడు

Sep 24 2019 9:56 AM | Updated on Sep 24 2019 9:56 AM

Students Rally On Created Jobs Of Village Secretary In AP - Sakshi

టెక్కలిలో ర్యాలీ నిర్వహిస్తున్న దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్, నాయకులు, యువత 

సాక్షి, టెక్కలి(శ్రీకాకుళం) : రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగనన్న వచ్చాడు.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఉద్యోగాలు తెచ్చాడు.. అంటూ గ్రామ వలంటీర్లు, యువకులంతా చేసిన నినాదాలు మిన్నంటాయి. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే నిరుద్యోగ యువతకు భరోసా కల్పించే దిశగా లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయడంపై కృతజ్ఞతగా టెక్కలిలో ఆనందోత్సవ ర్యాలీ సోమవారం నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రధాన రాజేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బగాది హరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో వలంటీర్లు, యువకులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ముందుగా స్థానిక వైఎస్సార్‌ కూడలిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్‌ జంక్షన్‌ వరకు పాదయాత్ర నిర్వహించి, బాబాసాహెబ్‌ విగ్రాహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా జగనన్న వచ్చాడు.. ఉద్యోగాలు తెచ్చాడు.. థ్యాంక్యూ జగనన్న.. అంటూ దారి పొడవునా నినాదాలతో ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు టి.కిరణ్, మండల కన్వీనర్‌ బి.గౌరీపతి  నాయకులు టి.జానకీరామయ్య, ఎస్‌.సత్యం, జి.గురునాథ్‌యాదవ్, కె.బాలకృష్ణ, నర్సింగ్‌ సాబతో, యూ.తమ్మయ్య, డి.కుశుడు, యూ.శంకర్, మదీన్, హెచ్‌.లక్ష్మణ్, ఎస్‌.మోహన్, యూ.విశ్వనాథం, జి.అప్పలరెడ్డి, ఎం.భాస్కర్, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

భర్తీతో చరిత్ర సృష్టించారు
గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ చేస్తామంటూ ఐదేళ్లపాటు లక్షలాది నిరుద్యోగులకు ఉసూరుమనిపించారని పార్లమెంట్‌ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ విమర్శించారు. పాదయాత్రలో నిరుద్యోగుల కష్టాలను తెలుసుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసి, చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు. ఎంతో పారదర్శకంగా జరిగిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను రాజకీయం చేయాలని చూస్తున్నారని, ఇటువంటి కుట్రలను తిప్పి కొట్టేందుకు ప్రజ లంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. గతంలో మంత్రిగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పి స్తానంటూ వేల సంఖ్యలో దరఖాస్తులు తీసుకున్నారని, అయితే ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదని ఎత్తిచూపారు. ప్రథి ఇంటికీ సంక్షేమ పథకాలు అందజేయాలనే ఉద్దేశంగా అమలుచేసిన గ్రామ వలంటీర్‌ వ్యవస్థపై ఈ రోజు అన్ని రాష్ట్రాల నుంచి ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. ఈ విధానం వల్ల అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందితే టీడీపీని పూర్తిగా మరచిపోతారనే భయంతోనే చంద్రబాబు లేనిపోని కుట్రలు చేస్తున్నారని దువ్వాడ మండిపడ్డారు.

దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి
టెక్కలి సమన్వయకర్త తిలక్‌ మాట్లాడుతూ... గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన అతి కొద్ది రోజుల్లోనే లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేశారన్నారు. అధికారుల పర్యవేక్షణలో ఎంతో పారదర్శకంగా చేపట్టిన ఉద్యోగాల భర్తీ వల్ల లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. అయితే దీనిని చూసి ఓర్వలేక ఎల్లో మీడియా దుష్ప్రచారాలకు ఒడి గట్టిందని దుయ్యబట్టారు. ఇటువంటి వాటిని తిప్పి కొట్టేందుకు యువత సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు..

Advertisement
 
Advertisement
Advertisement