
‘నైరుతి’ వచ్చేసింది..
ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఊరించి ఊరించి ఐదు రోజులు ఆలస్యంగా బుధవారం రాయలసీమను తాకాయి.
సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఊరించి ఊరించి ఐదు రోజులు ఆలస్యంగా బుధవారం రాయలసీమను తాకాయి. కర్ణాటకలోని బళ్లారి మీదుగా రుతుపవనాలు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించినట్టు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. నిజానికి రుతుపవనాలు ఈ నెల 5కల్లా రాష్ట్రాన్ని తాకాల్సి ఉంది. కానీ అరేబియా సముద్రంలో అషోబా తుపాను కారణంగా రుతుపవనాల్లో చురుకుదనం తగ్గింది. ఫలితంగా ఇవి ఆశించినంతగా ముందుకు కదల్లేదు.
దీంతో రాయలసీమ, కోస్తాంధ్రల్లో నైరుతి ప్రవేశానికి మరో రెండ్రోజుల సమయం పడుతుందని ఐఎండీ మంగళవారందాకా చెబుతూ వచ్చింది. దక్షిణ కర్ణాటకకు చేరిన రుతుపవనాలు.. దానికి ఆనుకుని ఉన్న రాయలసీమలో బుధవారం ప్రవేశించాయి. ఇవి మరింత విస్తరించాలన్నాపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనమో, వాయుగుండమో ఏర్పడాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పశ్చిమమధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ఇది బలపడి అల్పపీడనంగా మారితే ఉపయోగం. మరో మూడు రోజులదాకా ఆ పరిస్థితులు లేవని రిటైర్డ్ వాతావరణ శాస్త్రవేత్త ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు.ఈ వాతావరణ పరిస్థితులను బట్టి కోస్తాంధ్రలోకి రుతుపవనాల ప్రవేశానికి మరో నాలుగైదు రోజుల సమయం పట్టవచ్చని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అంచనా.
అక్కడక్కడా జల్లులు..: ప్రస్తుతం ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర వెంబడి అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ, రాయలసీమలో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులుగానీ, మోస్తరు వర్షాలుగానీ కురిసే వీలుందని ఐఎండీ తెలిపింది.