
గో‘దారుల’పై పీటముడి
పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన రహదారుల నిర్మాణంపై ఇరిగేషన్, ఆర్అండ్బీ అధికారుల మధ్య అవగాహన కుదరడం లేదు.
సాక్షి, రాజమండ్రి : పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన రహదారుల నిర్మాణంపై ఇరిగేషన్, ఆర్అండ్బీ అధికారుల మధ్య అవగాహన కుదరడం లేదు. పుష్కరాలకు సంబంధించిన రోడ్ల పనులన్నీ ఆర్అండ్బీ శాఖే చూసుకోవాలని గతంలో జరిగిన పలు సమావేశాల్లో కలెక్టర్ ఆదేశించారు. అయితే ఇరిగేషన్ పరిధిలోని ఏటిగట్టు రోడ్లను తాము అభివృద్ధి చేయలేమని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. మరోపక్క ఇరిగేషన్ రోడ్లను ఆ శాఖే అభివృద్ధి చేయాలని సంబంధిత మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారం జరిగిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. ధవళేశ్వరం నుంచి సీతానగరం వరకూ ఉన్న గోదావరి గట్టు రోడ్డును తాము నిర్వహించలేమని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్న విషయాన్ని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఇదే పరిస్థితి ఇతర ప్రాంతాల్లో కూడా నెలకొంది. దీనిపై ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ, ఎటువంటి రోడ్డు పనులనైనా ఆర్అండ్బీ శాఖే చూసుకోవాల్సిందిగా కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారని గుర్తు చేశారు. అయితే, మంత్రి దేవినేని దీనికి ససేమిరా అన్నారు. ఇరిగేషన్ రోడ్ల పనులను ఆ శాఖే చేయాలని చెప్పడంతో మళ్లీ అంచనాలు వేస్తామని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ తమ పరిధిలోని రహదారులపై దృష్టి పెట్టకుండా కేవలం ఘాట్లపైనే కసరత్తు చేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్తగా నిర్మించాల్సిన, అభివృద్ధి చేయాల్సిన 246 ఘాట్లకు రూ.90 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
త్వరలో టెండర్లు పిలిచేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో కొత్తగా రోడ్ల వ్యవహారం వచ్చి పడడం వారికి తలనొప్పిగా మారుతోంది. పుష్కరాలకు స్థానిక ఎమ్మెల్యేలు సూచించిన పనులను కూడా పరిగణనలోకి తీసుకుని ఆ పనులపై కూడా అంచనాలు పంపాలని మంత్రి దేవినేని సూచించారు. అంతేకాకుండా టెండర్లు పిలిచేముందు ఆ వివరాలు ఎమ్మెల్యేలకు ముందుగానే పంపాలని ఆదేశించారు. ఇప్పటికే తమ ప్రతిపాదనల్లో కోతలు పెడుతుండగా, మళ్లీ రోడ్లపై కూడా తాజా అంచనాలు వేయాలా? అని ఇరిగేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
బారికేడ్లకూ ఇదే స్థితి
పుష్కరాల్లో స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసే బారికేడ్ల విషయంలో కూడా ఇటువంటి అయోమయమే నెలకొంది. వీటిని నిర్వహించాల్సింది ఆర్అండ్బీయా లేక ఇరిగేషనా లేక పంచాయతీరాజ్ శాఖా అన్న సందిగ్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. అన్నింటినీ ఇరిగేషన్ శాఖే చూడాలని కలెక్టర్ చెబుతున్నా ఎవరికి వారు అంచనాలు వేసి పంపుతున్నారు. రాజమండ్రిలో ఏర్పాట్లకు కార్పొరేషన్ అధికారులు, కొన్ని పుష్కర ఘట్టాల్లో ఇరిగేషన్, గ్రామీణ ప్రాంతాల్లోని ఘాట్ల వద్ద పంచాయతీరాజ్.. ఇలా ఎవరికి వారు తమ అంచనాల్లో బారికేడ్ల నిర్వహణను ప్రతిపాదిస్తున్నారు.