చంద్రబాబు చరిత్ర హీనుడవుతాడు | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చరిత్ర హీనుడవుతాడు

Published Thu, Oct 1 2015 2:44 AM

MP YS Avinash Reddy Criticism on ap cm chandrababu

పులివెందుల : ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటం చేయకుంటే చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరచాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఖచ్చితంగా అవసరమన్నారు. ఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే నిధులను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఇచ్చి తీరాలన్నారు.

చంద్రబాబు మాత్రం హోదా ఇచ్చి.. నిధులు ఇవ్వకుంటే ఎలా అని అడ్డంగా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కంటే తన అభివృద్ధి కోసమే ఎక్కువగా పాటుపడుతున్నారని విమర్శించారు. హోదా ఉంటేనే రాష్ట్రానికి అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్‌ఆర్‌సీపీ మొక్కవోని దీక్షతో పోరాటం చేస్తోందన్నారు. గుంటూరులో దీక్ష చేపట్టాలని సిద్ధమైతే చంద్రబాబు ప్రభుత్వం దీక్షను అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తోందన్నారు.

చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి గట్టిగా పోరాడుతుందని స్పష్టం చేశారు. అనంతరం ఆయన వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రామగిరి జనార్ధన్‌రెడ్డి, తొండూరు ఎంపీపీ భర్త రవీంద్రనాథరెడ్డి, మున్సిపల్ వైస్ చెర్మైన్ చిన్నప్ప, లోమడ జనార్ధన్‌రెడ్డి, రసూల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement