నాగార్జున యూనివర్శిటీలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
సాక్షి, గుంటూరు: నాగార్జున యూనివర్శిటీలో గురువారం దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, మేరుగు నాగర్జున హజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దివంగత నేత విగ్రహావిష్కరణ కల నేరవేరడానికి పది సంవత్సరాలు పట్టిందని అన్నారు. అయితే పది సంవత్సరాల క్రితమే యూనివర్శిటీలో వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహావిష్కరణకు తీర్మాణం జరిగిందని, కానీ దానిని కుట్రలతో అడ్డంకులు కలగజేశారని ఆయన తెలిపారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, పేదలకు ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో ప్రజల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి అని అన్నారు. ఆయన హయాంలో కొత్త కోర్సుల రూపకల్పన చేసి యూనివర్శిటీ పురోగతికి పాటుపడ్డారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన వారసుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే ముదటిసారిగా అమ్మఒడి పథకాన్ని తీసుకువచ్చి ఆ పథకం కింద ఏడాదికి రూ.15వేల అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా నిరుద్యోగ యువత కోసం 4 లక్షల ఉద్యోగాలు భర్తి చేసిన నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. ఇక తండ్రి బాటలోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ది కోసం నవరత్నాలు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.