వైఎస్ జగన్ వద్ద తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావు కుటుంబీకులు
వ్యవస్థలను దిగజార్చేలా పోలీసుల తీరు
వైఎస్సార్సీపీ కేడర్ ఎవరూ భయపడొద్దు
టీడీపీ గూండాల దాడులను దీటుగా ఎదుర్కొందాం
పార్టీ అండగా ఉంటుంది
గురజాల వైఎస్సార్సీపీ నేతలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసుల అండతో పాలకులు గూండా రాజ్యం నడుపుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడులను దీటుగా ఎదుర్కొందామని, వైఎస్సార్సీపీ కేడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా దాచేపల్లి మండలం రామాపురానికి చెందిన వైఎస్సార్సీపీ నేత ఆకూరి వెంకటరెడ్డిపై టీడీపీ గూండాలు చేసిన హత్యాయత్నం గురించి వైఎస్ జగన్కు వివరించారు.
అలాగే చర్లగుడిపాడు గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలైన బీసీ సామాజికవర్గానికి(పద్మశాలి) చెందిన కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావును ఫిబ్రవరిలో టీడీపీ గూండాలు హత్య చేశారని వారి కుటుంబసభ్యులు వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వైఎస్ జగన్ స్పందిస్తూ.. వైఎస్సార్సీపీ కేడర్ ఎవరూ భయపడవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
టీడీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పారు. పార్టీ లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. వ్యవస్థలను దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, ఆకూరి వెంకటరెడ్డి, కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావుల కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, వేముల చలమయ్య, జంజనం తిరుపతి రావు, సైదయ్య, చెన్నారెడ్డి, షేక్ ఇమాం వలీ తదితరులున్నారు.
భగవాన్ మహావీర్కు జగన్ ఘన నివాళి
సాక్షి, అమరావతి: భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం ఆయన చిత్రపటానికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనోజ్ కొఠారి, ఏఎస్ఆర్ జేఎస్టీ సెక్రటరీ కుందన్ గాం«దీ, కరస్పాండెంట్ ప్రవీణ్ ఫౌలాముతా, ప్రవీణ్ కుమార్ జైన్, మనోజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
మహావీర్ మార్గం సదా ఆచరణీయం..
‘అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం.. అనే పంచ మహా వ్రతాలను ప్రజలకు బోధిస్తూ నైతిక జీవనానికి మార్గం చూపిన మహనీయుడు మహావీర్. ఆ మహర్షి చూపిన మార్గం సదా ఆచరణీయం. మంగళవారం జైనుల ఆధ్యాతి్మక గురువు మహావీర్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.


