ఎంపీ కనిపించడంలేదు!


 సాక్షి ప్రతినిధి, విజయవాడ :‘‘రాష్ట్ర విభజనను అడ్డుకుంటానంటూ బీరాలు పలికాడు.. టక్కుటమారాలతో మీడియాలో ప్రాచుర్యం పొందాడు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముమ్మాటికీ ఒక్కటిగానే ఉంచుతుందని నమ్మబలికాడు.. ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు.. తీరా రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం పలికేసరికి పత్తాలేకుండాపోయాడు.. నమ్ముకున్న బెజవాడవాసుల ఆశలను వమ్ముచేసి ఢిల్లీ, హైదరాబాద్‌ల చుట్టూ తిరుగుతున్న ఆయన్ను పట్టి ప్రజలకు అప్పగించాలి..  పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయకుండా 16 రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న ఆయన ఆచూకీ తెలపండి’’ అంటూ  మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు..

 

 ఇది విజయవాడ నుంచి పరారై తిరుగుతున్న ఎంపీ లగడపాటి రాజగోపాల్ తీరుపై మండుతున్న సమైక్యాంధ్ర ఉద్యమకారుల గుండెచప్పుడు. మాటల గారడీ, సర్వేల జిమ్మిక్కులతో జనాన్ని బురిడీకొట్టించి కాలాన్ని నెట్టుకొస్తున్న రాజగోపాల్‌కు రాజకీయ సమాధి కడతామంటూ సమైక్యాంధ్ర రాజకీయ విద్యార్థి కో-కన్వీనర్ గాలి సూర్యనారాయణరెడ్డి సోమవారం ప్రకటించారు. అమ్మా రాజగోపాల్ కనిపించాడా.. అయ్యా లగడపాటి తారసపడ్డారా.. అంటూ విజయవాడ నగరంలోని ప్రధాన వీధుల్లో వెతుకుతూ అందరిదీ ఆరా తీస్తూ ఎంపీ తీరుపై మంగళవారం సరికొత్త నిరసనోద్యమం జరగనుంది. ఈ క్రమంలో విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం నుంచి ఊరేగింపు జరిపేందుకు నిర్ణయించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top