
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టామని, వచ్చే మే నెలలోపు అన్ని ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే ఆదేశించారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. భవిష్యత్తులో భరోసా కేంద్రాలు సేకరణ కేంద్రాలుగా కూడా మారాలని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ పటిష్టత కోసం కీలక చర్చ జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. సుబాబుల్, యుకలిప్టస్ ధర కోసం సహాయం అందించేందుకు కమిటీని ఏర్పాటు చేపినట్లు తెలిపారు. రైతులకు అందించే గిట్టుబాటు ధరను రైతు భరోసా కేంద్రాల్లో బోర్డుల ద్వారా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా మార్కెట్ యార్డులు ఉంటాయని, మొదటిసారిగా గ్రామస్థాయిలో విత్తన సరఫరా జరగనుందని తెలిపారు. కాగా ధరల స్థిరీకరణ కోసం ప్రతీ వారం చర్చ, నిర్ణయాలు తప్పనిసరిగా ఉంటాయని కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ప్రతి నెల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధరల స్థిరీకరణపై సమీక్ష నిర్వహించనున్నారని,వచ్చే ఆర్థిక సంత్సరం పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజ్, గిడ్డంగులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్గానిక్ మిల్క్ ప్రాత్సాహాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు, ధరల విషయంలో కచ్చితమైన చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి కన్నబాబు వెల్లడించారు. రైతులకు మద్దతు ధర లేకపోతే ప్రభుత్వమే స్పందించి చర్యలు చేపట్టాలని వ్యవసాయ మిషన్ వైఎస్ చైర్మన్ నాగిరెడ్డి తెలిపారు.(అది ప్రజల ఆకాంక్ష: మంత్రి కన్నబాబు)