
తన బిడ్డతో దీక్ష చేస్తున్న సౌజన్య
తనకు ఆడపిల్ల పుట్టిందనే కారణంతో ఇంటికి తాళం వేసి పారిపోయడో పిరికి భర్త.
కడప: సమాజం ఎంత ముందుకు వెళుతున్నా లింగవివక్ష కొనసాగుతూనే ఉంది. ఆధునిక కాలంలోనూ ఆడపిల్లలను చిన్నచూపు చూడడం తగ్గలేదు. ఆడపిల్లను భారంగా భావించి, వదిలించుకోవాలనుకునే వారు ఇంకా సమాజంలో కనబడుతుండడమే ఇందుకు ప్రత్యక్ష సాక్షం. వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలం కొక్కరాయపల్లెలో ఇలాంటి ఉదంతమే వెలుగు చూసింది. తనకు ఆడపిల్ల పుట్టిందనే కారణంతో ఇంటికి తాళం వేసి పారిపోయడో పిరికి భర్త. దీంతో అతడి భార్య మూడు రోజులుగా ఇంటి ముందే దీక్ష చేస్తోంది.
వివరాలు ఇలా ఉన్నాయి... వీరపునాయునిపల్లెకు చెందిన సౌజన్యను 2012 ఏప్రిల్లో కొక్కరాయపల్లెకు చెందిన మల్లికార్జున వివాహం చేసుకున్నాడు. అదే ఏడాది డిసెంబర్లో పాప పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని గొడవ పడి తనను దూరం చేశాడని, మరోపెళ్లి చేసుకొనే ప్రయత్నం చేస్తున్నాడని సౌజన్య ఆరోపించింది. అతనిలో మార్పు లేకపోవడంతోనే తాను బిడ్డతో దీక్ష చేపడుతున్నట్లు పేర్కొంది. తన భర్త కావాలంటూ రెండేళ్ల చిన్నారితో ఇంటి బయటే నిరసనను తెలుపుతోంది. కాగా మల్లికార్జున్ తన తండ్రికి అనారోగ్యం వల్ల తామంతా తిరుపతిలో ఉన్నామని చెబుతున్నాడు.