లైంగిక దాడికి ప్రయత్నం.. పూజారికి దేహశుద్ధి!
సాక్షి, విజయవాడ : అమ్మవారి ఆలయానికి వచ్చిన ఓ బాలికకు అర్చకుడు మాయ మాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించడంతో అర్చకుడికి దేహశుద్ధి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. పాయకాపురం ప్రకాష్నగర్కు చెందిన బాలాజీ ప్రకాష్నగర్లోని కార్పొరేషన్ స్థలంలో కొన్నేళ్ల క్రితం నిదానంపాటి అమ్మవారి ఆలయం పేరుతో చిన్న గుడిని స్థాపించాడు.
పూజారిగా అవతారం ఎత్తి నిదానంగా ఆ గుడిలో ఇతర దేవుళ్ల విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి పెద్ద ఆలయంగా మార్చాడు. అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఇటీవల గుడికి వచ్చింది. ఆమె ఆరోగ్యం కోసం పూజలు చేయాలని కోరింది. పూజలు చేస్తానని చెప్పి గుడి బయట ఉన్న అతడి గదిలోకి తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లిన తరువాత అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక దాడికి ప్రయత్నించడంతో భయపడిన బాలిక, ఇంటికి పరుగు తీసి, కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. వీడియోలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ విషయం స్థానికంగా కలకలం సృష్టించింది.
ఘటనపై ఫిర్యాదు రాలేదు..
ఈ ఘటనపై నున్న సీఐ ప్రభాకర్ను వివరణ కోరగా నిదానం పాటి అమ్మవారి ఆలయ పూజారి బాలాజీకి సంబంధించి గానీ, అటువంటి ఘటన గురించి కానీ తమకు ఎటువంటి సమాచారం రాలేదని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. దీనిపై విచారణ చేయిస్తామని చెప్పారు.