ఎక్కడి రైళ్లు అక్కడే... | Express trains canceled | Sakshi
Sakshi News home page

ఎక్కడి రైళ్లు అక్కడే...

Oct 28 2013 1:55 AM | Updated on Sep 2 2017 12:02 AM

భారీ వర్షాలు వాల్తేరు రైల్వేకు ఊహించని నష్టాన్ని మిగులుస్తున్నాయి. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన దాదాపు అన్ని రైళ్లపైనా శనివారం అర్ధరాత్రి నుంచి వరద ముప్పు ప్రభావం

సాక్షి,విశాఖపట్నం: భారీ వర్షాలు వాల్తేరు రైల్వేకు ఊహించని నష్టాన్ని మిగులుస్తున్నాయి. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన దాదాపు అన్ని రైళ్లపైనా శనివారం అర్ధరాత్రి నుంచి వరద ముప్పు ప్రభావం తీవ్రస్థాయిలో చూపుతోంది. వేలాదిమంది ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రైల్వేచరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా రాజధానికి రైళ్లను నిలిపివేశారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు నదులు,కాలువలు పొంగిపొర్లుతుండడంతో రైల్వేబ్రిడ్జిలపైనుంచి వరదనీరు ప్రవహిస్తోంది.

ఉభయగోదావరి జిల్లాల్లో తుని,సామర్లకోట,రాజమండ్రి రూరల్,పిఠాపురం వంటి అనేక చోట్ల రైల్వేట్రాక్‌లపై మూడు అడుగులకు మించి నీరు ప్రవహిస్తోంది. పాయకరావుపేట-తుని మధ్య తాండవ నదిపైనున్న రైల్వేబ్రిడ్జిపై నుంచి నీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం, రాత్రి వేళల్లో బయలుదేరిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వద్ద, గరీబ్థ్,రయశ్వంత్‌పూర్‌లను తుని వద్ద, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను సామర్లకోట, మచిలిపట్నం-విశాఖ ప్యాసింజర్‌ను బిక్కవోలు వద్ద తెల్లవారుజామున నిలిపివేశారు.
 
విశాఖ నుంచి ఆదివారం ఉదయం వెళ్లాల్సిన జన్మభూమి,ప్రశాంతి,రత్నాచల్, తిరుమల,కోణార్క్, సింహాద్రి,గోదావరి,గరీబ్థ్ రైళ్లను రద్దుచేశారు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి వరకు వచ్చిన గోదావరి,గరీబ్థ్‌న్రు ఎక్స్‌ప్రెస్‌లను తిరిగి తుని నుంచి తిరుమల,విశాఖ ఎక్స్‌ప్రెస్‌లను రాజమండ్రి నుంచి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను గుంటూరు నుంచి నడిపారు. యశ్వంత్‌పూర్ ఫలక్‌నుమా తదితర రైళ్లను దారిమళ్లించారు.

ఆదివారం హైదరాబాద్ నుంచి విశాఖకు బయలుదేరాల్సిన గోదావరి,గరీబ్థ్‌న్రు దక్షిణమధ్య రైల్వే అక్కడ రద్దుచేయగా, ఇక్కడ వాల్తేరు డివిజన్ అధికారులు సోమవారం విశాఖ నుంచి బయలుదేరాల్సిన గోదావరి, గరీబ్థ్, తిరుమల ఎక్స్‌ప్రెస్‌తోపాటు విశాఖపట్నం-నాందేడ్ రైలును రద్దు చేస్తున్నట్లుప్రకటించారు. అలాగే ఆదివారం ఒడిషా-కోల్‌కతా, బెంగళూరు,చెన్నై ప్రాంతాలనుంచి విశాఖ మీదుగా వెళ్లాల్సిన 23 రైళ్లు రద్దయ్యాయి.ఇవికాకుండా ఒడిషా-హౌరా, విశాఖ-చెన్నై,విశాఖ-బెంగళూరు మార్గాల్లో మరో 14 రైళ్లను ఆది,సోమవారాల్లో దారి మళ్లించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement