రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవసరమైతే తమ రక్తాన్ని సైతం ధారపోస్తామని ఏపీ ఎన్జీవోలు స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవసరమైతే తమ రక్తాన్ని సైతం ధారపోస్తామని ఏపీ ఎన్జీవోలు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగిస్తున్న నిరసన కార్యక్రమాలలో భాగంగా గురువారం నాడు వారు హైదరాబాద్లోని సచివాలయం ఎదుట రక్త దానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమైక్యాంధ్రకు మద్దతు పలుకుతున్న వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని సమైక్య నినాదాలు చేశారు.
సచివాలయం ఎదుట తాత్కాలికంగా శిబిరాలు ఏర్పాటుచేసి, అక్కడ రక్తదానం చేశారు. సమ్మెలో పాల్గొంటున్న వారితో పాటు వారికి మద్దతుగా వచ్చినవారు కూడా రక్తదానం చేశారు. పలువురు వైద్యులు వారికి ఈ మహోద్యమంలో సాయంగా నిలిచారు. రెండు రోజుల క్రితం ఉద్యోగులంతా నల్ల దుస్తులు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. వందలాది మంది పురుషులు, మహిళలు నల్లటి దుస్తుల్లో సంద్రంలా తరలి వచ్చి సమైక్య నినాదాలు చేశారు.
గత కొన్ని రోజులుగా ఏపీ ఎన్జీవోలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. సచివాలయం బయట రోడ్డు మీదే వంట- వార్పు చేసి బహిరంగ భోజనాలు చేస్తున్నారు. సెప్టెంబర్ రెండో తేదీ నుంచి తాము నిరవధిక సమ్మె ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతికి నోటీసు కూడా ఇచ్చారు. హైకోర్టు ఈ సమ్మెపై ఆగ్రహం వ్యక్తం చేసినా సరే.. తమ నిరసనను మాత్రం కొనసాగిస్తామని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమ్మె ఫలితంగా సీమాంధ్ర ప్రాంతంలోని దాదాపు 50 వేల పాఠశాలలు మూతపడ్డాయి. దాదాపు 2 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొంటున్నారు.