ఎట్టకేలకు డీఎస్సీ ! | DSC schedule released | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు డీఎస్సీ !

Nov 21 2014 2:05 AM | Updated on May 25 2018 5:44 PM

ఎట్టకేలకు నాలుగు వాయిదాల అనంతరం ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు సన్నదమైంది.

సాక్షి, చిత్తూరు: ఎట్టకేలకు నాలుగు వాయిదాల అనంతరం ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు సన్నదమైంది. డీఎస్సీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధంచేసింది మే 9,10,11 తేదీల్లో డీఎస్సీకి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమరుుంది. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది బీఈడీ, డీఈడీతో పాటు లాంగ్వేజ్ పండిట్స్ తదితరులు డీఎస్సీ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూపులు చూస్తున్నారు.

తాజాగా గురువారం విద్యాశాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి తేదీలను ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠకు తెరపడింది. చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్‌కు సంబంధించి 221 పోస్టులు ఖాళీగా ఉండగా, సెకెండరీ గ్రేడ్‌కు సంబంధించి 1194 పోస్టులున్నాయి.

ఇంకా లాంగ్వేజ్ పండిట్స్ 182 ఉండగా, పీఈటీలకు సంబంధించి 9 పోస్టులు ఉన్నాయి. మొత్తం జిల్లాలో 1606 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 30 బీఈడీ కళాశాలలు, 48 డీఈడీ కళాశాలలు ఉన్నాయి.  వీటి పరిధిలో ఏడాదికి 15వేలకు పైచిలుకు విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు. రెండు సంవత్సరాలుగా డీఎస్సీ జరగకపోవడంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 35 నుంచి 40వేల మంది అర్హులైన అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం.

మాట మార్చిన విద్యాశాఖ మంత్రి
ఎన్నికల సమయంలో డీఎస్సీకి సంబంధించి బీఈడీ, డీఈడీ అన్న తేడా లేకుండా అందరికీ అర్హత కల్పిస్తామని బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పిస్తామని  ప్రకటించిన మంత్రి ఘంటా శ్రీనివాసరావు ఆ తరువాత మాట మార్చారు.  ప్రభుత్వం ఏర్పడిన అనంతరమే డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించిన మంత్రి  ఐదు నెలలు దాటుతున్నా ఆ పని చేయలేదు. టెట్ లేకుండా చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పడెమో టెట్ కాకుండా తాజాగా ఉమ్మడి పరీక్షా విధానంతో డీఎస్సీ నిర్వహిస్తామని ఉపాధ్యాయులను ఎంపిక చేస్తామంటూ కొత్తగా ప్రకటిస్తున్నారు. చివరికి ఏమీ చేస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు.

Advertisement
 
Advertisement
Advertisement