
జగన్ హెల్త్ బులెటిన్ విడుదలపై అధికారుల తర్జనభర్జన
చంచల్గూడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదలపై అధికారుల తర్జనభర్జనపడుతున్నారు.
హైదరాబాద్: చంచల్గూడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదలపై అధికారుల తర్జనభర్జనపడుతున్నారు. హెల్త్ బులెటిన్ విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల వివరాలు అందని కారణంగా సమాచారం ఇవ్వలేకపోతున్నట్లు జైలు అధికారులు చెప్పారు. వాస్తవానికి జైలు నిబంధనల ప్రకారం జైలులో నిరాహారదీక్ష చేపట్టకూడదని, తాము హెల్త్ బులెటిన్ విడుదల చేయకూడదని వారు చెబుతున్నారు.
రాత్రి 9:30 గంటల తర్వాత రిపోర్టులు అందుతాయని అధికారులు ప్రకటించారు. ఇక వేచిచూడ్డం మంచిదికాదని జైలు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి తరలిస్తే మంచిదంటూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
ఇప్పటికి జగన్ దీక్ష చేపట్టి 109 గంటలు పూర్తి అయింది. ఆయన బాగా నీరసించారు. ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఆరోగ్యంపై జైలు అధికారులు కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. జగన్ ఆరోగ్యంపై జైలు అధికారులు రెండు సార్లు సమావేశమై సమీక్షించారు. తీసుకోవలసిన చర్యలపై కూడా వారు చర్చించారు. జైళ్ల శాఖ డీజీ ఉన్నతస్థాయి అధికారులతో జగన్ దీక్షపై సమీక్ష నిర్వహించారు.
హోం శాఖ కార్యదర్శికి నివేదిక కూడా పంపారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించుకున్నారు.
ఇదిలా ఉండగా, జగన్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ చంచల్గూడ జైలు దగ్గరకు చేరుకున్న నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సిటీ సేవాదళ్ కన్వీనర్ వెల్లాల రామ్మోహన్, ప్రపుల్లా రెడ్డి, మరికొందరు కార్యకర్తలను కాంచన్బాగ్ పోలీస్టేషన్కు తరలించారు.