ధర్మపోరాటమంటే రాళ్లతో కొట్టడమా?

Dharmana Prasada Rao fires on Chandrababu Government - Sakshi

కవిటి: ధర్మ పోరాటమంటే రాష్ట్రానికి వచ్చిన వారిని రాళ్లతో కొట్టడమేనా? అని వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. శనివారం కవిటిలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు అధ్యక్షతన యువభేరి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, రెడ్డిశాంతి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ధర్మాన మాట్లాడుతూ తిరుపతి వెంకన్న దర్శనానికి వచ్చిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా వాహనశ్రేణిపై రాళ్లదాడి చేయడం శోచనీయమన్నారు. దాడి జరిగే అవకాశముందని బీజేపీ నేతలు ముందస్తు సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.

నాలుగేళ్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవనియా అన్న పెద్ద మనిషి నాలుగేళ్ల తర్వాత ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యమని యూటర్న్‌ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. అధర్మ విధానాలతో ధర్మపోరాటాలు చేస్తున్నట్టు  ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న మోసపూరిత విధానాలను ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. 97 వేల కోట్ల అప్పును నాలుగేళ్ల కాలంలో రెండు లక్షలకు పెంచి రాష్ట్రాన్ని దివాళా తీయించి  ప్రజలకు భారాన్ని మిగిల్చారన్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సామంతులు, బెంతు ఒడియాలు, మత్స్యకారులు, మైనార్టీ కులాల ఓట్లు సాధించడంలో సరైన ప్రణాళికతో ఈ పదినెలల కాలంలో ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 

రెడ్డిక, యాదవ, కాళింగ, అగ్నికులక్షత్రియ తదితర కులాలన్నీ ఏకతాటిపై తెచ్చి వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసేలా ఓటర్ల మనసు గెలుచుకోవాలన్నారు. యువకులు సోషల్‌మీడియాను ఆయుధంగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి సమన్వయకర్తలు నర్తు రామారావు, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, తమ్మినేని నాగ్‌చిరంజీవి, నవీన్‌కుమార్‌ అగర్వాలా, పి.ఎం.తిలక్, పూడి నేతాజీ, డాక్టర్‌ ఎన్‌.దాస్, పులకల శ్రీరాములు, రజినీకుమార్‌ దొళాయి, పిలక రాజలక్ష్మీ, ఇప్పిలి లోలాక్షి, సత్యన్నారాయణ పాఢి, శ్యాంపురియా, జయప్రకాష్, శ్యాంప్రసాద్‌రెడ్డి, కారంగి మోహనరావు, కడియాల ప్రకాష్, ఎన్ని అశోక్, తడక  జోగారావు, వజ్జ మృత్యుంజయరావు, పిట్ట ఆనంద్‌కుమార్, కాళ్ల దేవరావు తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ నాయకత్వంతోనే అభివృద్ధి..
రాష్ట్రానికి జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యపడుతుంది. యువకులు రానున్న కీలకమైన ఎన్నికల రణక్షేత్రంలో అలుపెరగని సైనికుల్లా కష్టపడి పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రి చేసేలా సమాయత్తం కావాలి.
– రెడ్డి శాంతి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

యువత ఐక్యంగా పనిచేయాలి
రాష్ట్రంలో టీడీపీ పార్టీ సాగిస్తున్న అరాచకపాలనను అంతమొందించడానికి వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఐక్యతతో పోరాడాలి. అన్ని రంగాల్లో ప్రభుత్వ అవినీతి అక్రమాలను యువత వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరించి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి.
– తమ్మినేని నాగ్‌చిరంజీవి,
 వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి.

వైఎస్సార్‌సీపీ గెలుపు అభివృద్ధికి నాంది
వైఎస్సార్‌సీపీ గెలుపు రాష్ట్రాభివృద్ధికి నాందిపలుకుతుంది. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డిపై పెరుగుతున్న ఆదరణే ఇందుకు నిదర్శనం. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు అందరూ కలిసి రావాలి.
– నర్తు రామారావు,
 వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, ఇచ్ఛాపురం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top