మాఫీ మాయే ముంచింది!

మాఫీ మాయే ముంచింది! - Sakshi


సర్కారు ప్రకటించిన పంట రుణాల మాఫీ మొత్తం    766.79

2014-15లో తొలివిడత సర్దుబాటు చేసిన మొత్తం   340.18

డ్వాక్రా రుణాల భారం వడ్డీతో కలిపి.. సుమారు          1000.00

సభ్యురాలికి రూ.3 వేలు చొప్పున సర్దుబాటు మొత్తం        139.00


 

మాఫీ అయితే మాకీ దుర్గతి తప్పేది


నాకు రెండెకరాల పొలం ఉంది. ఎకరా మెట్టలో సగం చెరుకు, సగం వరి సాగు చేస్తున్నా. ఎకరా పల్లం భూమిలో వరి సాగు చేస్తున్నా. వ్యవసాయం కోసం తుమ్మపాల పీఏసీఎస్‌లో రూ.20వేల రుణం తీసుకున్నా. మాఫీ కాలేదు. వడ్డీతోసహా చెల్లించా. గతేడాది బ్యాంకు నుంచి రూ.20 వేల రుణం తీసుకున్నా. ఆశించినస్థాయిలో దిగుబడి లేకపోవడంతో అప్పు తీర్చే దారిలేక ప్రైవేటు వ్యాపారుల నుంచి మరో రూ.50 వేలు అప్పు తీసుకున్నా. తక్కువ వడ్డీయే అయినప్పటికీ ప్రస్తుత ఖరీఫ్‌లో కూడా ఆశించిన దిగుబడిలేక అప్పు చెల్లించే దారిలేని స్థితి. మాఫీ జరిగి ఉంటే నా పరిస్థితి వేరేలా ఉండేది.

 -పట్నాల వెంకటరమణ,

 రైతు,తుమ్మపాల

 

కొత్త రుణం ఇవ్వలేదు..

డ్వాక్రా రుణమాఫీ అవుతుందని ఆశించాం. కానీ మాఫీ కాలేదు. మా సంఘం తీసుకున్న రుణం రూ1.50 లక్షలు 14 శాతం వడ్డీతో కలిపి చెల్లించాల్సిన అగత్యం ఏర్పడింది. పెట్టుబడి నిధి కింద ఒక్కో సభ్యురాలికి రూ.3వేలు జమ చేస్తామని చెప్పినప్పటికీ మా సంఘం మొత్తానికి రూ.3వేలు మాత్రమే జమైంది. సంఘ సభ్యులంతా  తోపుడుబళ్లపై కూరగాయలు అమ్మడం.. ఇతర చిరువ్యాపారాలు చేసుకునే వారే. కొత్తగా రుణం అందక వ్యాపారం కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు చేయాల్సి వస్తోంది. బ్యాంకులో పేరుకుపోయిన రుణ బకాయిలకు, బయటతెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తోంది.

 -ఎం.రత్నం, నూకాంబిక

 గ్రూప్ సభ్యురాలు,

 గోపాలపట్నం

 

విశాఖపట్నం: చంద్రబాబు చేసిన రుణమాఫీ మాయ కాల్‌మనీ భూతం రూ పం దాల్చి రైతులు, డ్వాక్రా మహిళలు, చిరు వ్యాపారులను కబళి స్తోంది. రుణాలు మాఫీ కాకపోవడంతో అన్నదాతలు, డ్వాక్రా మహిళలు అప్పు ల ఊబిలో కూరుకుపోతున్నారు. రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తే తమకు ఈ దుస్థితి దాపురించేది కాదని వాపోతున్న వారి ఆవేదనకు ఈ గణాంకాలే సాక్ష్యం.



అప్పుల ఊబిలో అన్నదాతలు

జిల్లాలో 4.56 లక్షల మంది రైతులు, 3.10 లక్షల మంది వ్యవసాయ కార్మికులున్నారు. 3.87లక్షల మంది రైతులకు వడ్డీతో కలిపి రూ.1250 కోట్ల వరకు రుణాలున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన మాఫీ హామీ ధీమాతో వీటిని చెల్లించకపోవడంతో పావలా, జీరో పర్సంట్ వడ్డీ రాయితీలను రైతులు కోల్పోయారు. పైగా 14 శాతం వడ్డీ భారం పడింది. 3 విడతల్లో 2,33,309 మంది రైతులకు చెందిన రూ.766.79 కోట్లు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించిన సర్కార్.. 2014-15లో తొలివిడతగా రూ.340.18 కోటు ్లసర్దుబాటు చేసింది. మిగిలిన మొత్తాన్ని నాలుగేళ్లలో సర్దుబాటు చేస్తామని చెప్పినా 2015-16 ఆర్ధిక సంవత్సరం మరో 3 నెలల్లో ముగుస్తున్నప్పటికీ రెండోవిడత సర్దు బాటు నిధులు జమ చేయలేదు. రూ.50 వేల వరకు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని, మిగిలిన వారికి లక్షన్నర వరకు మాఫీ వర్తింపజేస్తామని చెప్పినా ఆ మేరకు జిల్లాలో ఏ ఒక్క రైతు లబ్ధిపొందలేదు. పాత రుణాలు చెల్లించకపోవడంతో గత రెండేళ్లలో రైతులకు కొత్త రుణాలు అందలేదు. వ్యవసాయ రుణాల కింద గతేడాదిరూ.1653 కోట్లకు రూ.880 కోట్లే ఇచ్చారు. ఈ ఏడాది రూ.1980 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ. 650 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు. 2.50లక్షలకుపైగా ఉన్న కౌలురైతుల్లో ఈ ఏడాది 20,260 మంది కౌలురైతులకు కనీసం రూ.50 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు 1498 మందికి రూ.3 కోట్ల రుణాన్ని మాత్రమే మంజూరు చేశారు. ఇలా పాత రుణాలు మాఫీ కాక.. కొత్త రుణాలు మంజూరు కాకపోవడంతో అన్నదాతలు రెండేళ్లుగాప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇలా తీసుకున్న అప్పుల మొత్తం రూ.1250కోట్లకు పైమాటేనని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. గత ఏడాది పంటలన్నీ హుద్‌హుద్ బారిన పడడంతో వడ్డీతో కలిసి ఈ అప్పులు రైతులకు గుదిబండగా మారాయి.



డ్వాక్రా మహిళల పరిస్థితి మరీ ఘోరం

మాఫీ హామీ పుణ్యాన డ్వాక్రా వ్యవస్థను నిర్వీర్యమైపోయింది. జీవీఎంసీతోపాటు గ్రామీణ, ఏజెన్సీ పరిధిలో 67,903 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వీటిలో 7,62,534 మంది సభ్యులున్నారు. వీరికున్న రూ.886 కోట్ల రుణాలు వడ్డీతో కలిసి వెయ్యికోట్లు దాటిపోగా ఒక్కపైసా కూడా మాఫీ కాలేదు. సభ్యురాలికి రూ.3వేలు చొప్పున పెట్టుబడి నిధి కింద రూ.139 కోట్లు సర్దుబాటు చేశారు. బకాయిలు పేరుకుపోవడంతో పావలా వడ్డీ, జీరో పర్సంట్ వడ్డీ రాయితీ కోల్పోయారు. మాఫీ విషయంలో సర్కార్ చేతులెత్తేయడంతో విధిలేక మొత్తం రుణం వడ్డీతో సహా చెల్లిస్తున్నారు. 2014-15లో రూ.640 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా రూ.200 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు. 2015-16లో 24,392 సంఘాలకు రూ.528.44 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 7,765 సంఘాలకు రూ.284.86 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు.స్త్రీ నిధి పథకం కింద 2014-15లో రూ.40 కోట్లకు గాను రూ.10 కోట్ల రుణాలు, 2015-16లో 30,057 సంఘాలకు రూ.50 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. 1067 సంఘాలకు రూ.10.18 కోట్లు మాత్రమే ఇచ్చారు. జిల్లాలో సకాలంలో రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో ఏకంగా 21,912 సంఘాలు ఎన్‌పీఎ జాబితాలోకి చేరాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మాఫీ పుణ్యమాని ప్రైవేటు వ్యాపారుల వద్ద డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు అక్షరాల రూ.వెయ్యికోట్ల పైమాటే. కొత్త రుణాలందక ప్రైవేటు వడ్డీ వ్యాపారులవద్ద చేసిన అప్పులు తీర్చ లేకవడ్డీ వ్యాపారులను ఆశ్రయించి కొత్త సమస్యల్లో చిక్కుకుంటున్నారు.

 

అప్పులిచ్చేవారు కరువైపోయారు


నేను మెన్స్ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నాను. రోజువారీ రొటేషన్‌కు మాకు డబ్బు అవసరమవుతుంది. దాంతోపాటు మా సిబ్బంది అవసరాలకు కూడా కొంత మొత్తం అప్పు తీసుకొని రోజూ తిరిగి కట్టేవాళ్లం. కాల్ మనీ వ్యవహారం వెలుగు చూసిన తరువాత అప్పు ఇచ్చేవారు రావడం మానేశారు. దీనివల్ల మాకు డైలీ రొటేషన్ కష్టంగా మారింది. ఇప్పటివరకు మేం డబ్బులు అప్పుగా తీసుకొంటున్నవారి నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండానే గడిచింది.

 - పి.రాంబాబు, గాజువాక

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top