టీడీపీకి 'షా'కిచ్చేలా..!

Amit Shah Slams Chandrababu Naidu - Sakshi

చంద్రబాబుపై అమిత్‌ఆగ్రహం

బాబు ప్రతి విషయంలో యూ టర్న్‌ తీసుకుంటారని ఎద్దేవా

పలాసలో బస్సు యాత్ర ప్రారంభించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు 

శ్రీకాకుళం, కాశీబుగ్గ : అన్నం పెట్టిన చేతినే నరికే తీరు చంద్రబాబుదని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. ఆయన సోమవారం పలాసలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన బస్సు యాత్రను ప్రారంభించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామన్నప్పుడు వెంకయ్యనాయుడు, హరిబాబుల సాక్షిగా చంద్రబాబు మోదీకి ధన్యవాదాలు తెలిపారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు యూటర్న్‌ తీసుకుని ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు నటిస్తున్నారని అన్నారు. అధికారం కోసం బీజేపీతో కలవడానికి అప్పట్లో బాబు ఎంతో ప్రాధేయపడ్డారని, ఇప్పుడు మళ్లీ అధికారం కోసమే కాంగ్రెస్‌తో జత కడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇస్తున్న పథకాలను తమవిగా ప్రచారం చేసుకుంటున్న టీడీపీ పాలనకు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్‌ పరువు తీస్తున్నారు..
అవినీతి పాలన సాగిస్తున్న చంద్రబాబుకు మరో అవకాశం ఇవ్వకూడదని అమిత్‌ షా సూచించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి టీడీపీని లాగేసుకున్నారని అమిత్‌ షా గుర్తు చేశారు. వాజ్‌పేయి హయాంలో ఎన్టీఆర్‌ ఎం తో ఉన్నత స్థానంలో ఉండేవారని, చంద్రబాబు ఆయన పరువు తీస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 14 అంశాల ఒప్పందం జరిగితే అందులో పది పూర్తయ్యాయన్నారు. తాము 22 జాతీయ సంస్థలను నెలకొల్పితే బాబు తానేదో సాధించినట్టు చెప్పుకుంటున్నారనివిమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు రాయలసీమకు ఏ ప్రాజెక్టు తీసుకువచ్చారని ప్రశ్నించారు.

యూటర్న్‌ తీసుకుంటున్నారు..
ప్రతి విషయంలో చంద్రబాబు యూ టర్న్‌ తీసుకుంటారని, అలాంటి నాయకుడిని నమ్మవద్దని చెప్పారు. మోదీపైనా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి పది లక్షల ఇళ్లు ఇస్తే దానికి చంద్రన్న ఇల్లుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఉజ్వల్‌ గ్యాస్‌ కనెక్షన్లు కూడా కేంద్రం ఇచ్చినవేనని అన్నారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బస్సు యాత్ర ద్వారా చంద్రబాబు బండారం బయటపెడతామన్నారు. అనంతరం యాత్రను శ్రీకాకుళం వరకు కొనసాగించారు.కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంటరీ కన్వీనర్, మాజీ ఎంపీ డాక్టర్‌ కణితి విశ్వనాథం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం, పార్టీ నాయకులు బాబూమోహన్, రిటైర్డ్‌ జడ్జి ఎవీ రావు, కిసాన్‌ అధ్యక్షుడు సూర్యనారాయణ రా జు, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, విష్ణువర్ధన్‌ రెడ్డి, ఉత్తరాంధ్ర జోనల్‌ ఇన్‌చార్జి పూడి తిరుపతిరావు, పార్టీ నాయకులు శవ్వాన ఉమామహేశ్వరి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అమిత్‌ షా గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తున్న పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ, ఆ పార్టీ జిల్లాఅధ్యక్షురాలు గౌతు శిరీష, నాయకులు
పలాస ఎమ్మెల్యేకు భంగపాటు
కాశీబుగ్గ: పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీకి సోమవారం భంగపాటు ఎదురైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద దిగిన సమయంలో టీడీపీ నాయకులు ఆందోళన చేశారు. మానవహారం, ర్యాలీలు నిర్వహించి నిరసన తెలి పారు. అయితే అది కాస్తా శ్రుతి మించడంతో పో లీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. అమిత్‌ షా కాన్వాయ్‌ ముందు నిరసన తెలపాలని నా యకులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ప్రత్యేకించి తనపైకి పోలీసులు ఎన్నడూ రాలేదన్న ధీమాతో ఎమ్మెల్యే రెండు గంటలపా టు నిరసనల్లో పాల్గొన్నారు. సీఐ వి.చంద్రశేఖ రం నచ్చజెప్పినా ఎమ్మెల్యేతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, అల్లుడు వెంకన్న చౌద రి వినలేదు. స్పెషల్‌ పార్టీ పోలీసుల మాటా వినకపోవడంతో వారిని బలవంతంగా అరెస్టు చేశా రు. గతంలో జగన్, పవన్‌ కల్యాణ్‌ రాకల సందర్భంలోనూ ఇలాగే నిరసన చేస్తే పోలీసులు ఏమీ అనలేదు. ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేతో సహా ఆయన కుటుంబాన్ని, పార్టీ నాయకులను అరె స్టు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top