వార్షిక కార్యక్రమ అమలు ప్రణాళిక (ఏపీఐపీ) కింద ప్రభుత్వం జిల్లాకు రూ.1.49 కోట్లు కేటాయించిందని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్ ఏఇ రాబర్ట్స్ వెల్లడించారు.
- నిర్లక్ష్యపు సిబ్బందిపై కఠిన చర్యలు
- పత్రికల కథనాలపై స్పందించండి
- జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ పీడీ రాబర్ట్స్
విశాఖపట్నం: వార్షిక కార్యక్రమ అమలు ప్రణాళిక (ఏపీఐపీ) కింద ప్రభుత్వం జిల్లాకు రూ.1.49 కోట్లు కేటాయించిందని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్ ఏఇ రాబర్ట్స్ వెల్లడించారు. ఎంవీపీ కాలనీలోని సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సీడీపీఓల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నిధులతో జిల్లాలో 250 అంగన్వాడీ భవనాలను నిర్మిస్తామని తెలిపారు.
ఇందుకోసం సీడీపీఓలు రెవెన్యూశాఖ సహకారంతో స్థల సేకరణ చేయాలని ఆదేశించారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో 161 భవనాలు, నర్సీపట్నంలో 45 భవనాలు, విశాఖ డివిజన్ పరిధిలో 44 భవనాలను నిర్మిస్తామని తెలిపారు. ఒక్కో భవనానికి రూ.6.50 లక్షలు కేటాయిస్తామని తెలిపారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలపై మరింత శ్రద్ధ వహించి పర్యవేక్షించాలని ఆదేశించారు. నిర్లక్ష్యపు సిబ్బందిని సస్పెండ్ చేయాలని కోరారు. పత్రికల్లో వచ్చే వార్తలపై వెంటనే స్పందించి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీడీపీఓలు కూడా తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
జీఓ-87 ప్రకారం తక్కువ బరువుతో పుట్టే పిల్లల వివరాలు సేకరించి తగిన పోషకాహారం అందేలా చూడాలన్నారు. ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలన్నారు. రెండు నెలలకు అడ్వాన్స్ నిధులు విడుదల చేశామన్నారు. జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల కోసం రూ.75 లక్షలు విడుదలయ్యాయన్నారు. యాభై శాతం కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీకల్లా గ్యాస్స్టవ్లు అమర్చాలని కోరారు. బాలామృతం ఆహారాన్ని 30 రోజుల్లోగా వినియోగించాలన్నారు.
పిల్లలను ప్రతి నెలా బరువు తూచేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్కింగ్ ఉమెన్స్ వసతిగృహాలకు విధిగా లెసైన్సులుండేలా సీడీపీఓలు చర్యలు తీసుకోవాలన్నారు. లెసైన్సుల్లేని సంస్థలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇక సీడీపీఓ కార్యాలయాల కోసం నర్సీపట్నానికి రూ.46 లక్షలు, అర్బన్-2కి రూ.45 ల క్షలు మంజూరయ్యాయని గుర్తు చేశారు. సమావేశంలో సంస్థ సహాయ ప్రాజెక్ట్ డెరైక్టర్ జి.చిన్మయిదేవి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీడీపీఓలు పాల్గొన్నారు.