
సాక్షి, చెన్నై: కావేరీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేదిశగా తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం అకస్మాత్తుగా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం నిరాహార దీక్ష దిగారు. వెంటనే కావేరీ జలాల మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఒక నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది.
ఈ నిరాహార దీక్షలో పార్టీ శ్రేణులు, నేతలు, మంత్రులు పాల్గొంటారని మొదట తెలిపారు. దీక్షలో కూర్చునే నేతల జాబితాలో సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీర్ పేరు లేదు. కానీ, కావేరీ జలాల విషయంలో అన్నాడీఎంకే కేంద్రంపై తగినంత ఒత్తిడి తీసుకురావడం లేదన్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఏకంగా పళని, పన్నీర్ ఇద్దరూ దీక్షలో కూర్చున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు దీక్షలో పాల్గొంటున్నాయి.