ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమార్కులపై ఉచ్చు బిగుస్తోంది. రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. అర్హులకంటే అనర్హులకే ఇళ్లు మంజారు అయినట్లు అధికారులు గుర్తించారు. ఇళ్లను కట్టకుండానే బిల్లులు మంజూరు అయినట్లు గుర్తించటం జరిగింది. పెద్దేముల్ మండలం రేగొండిలో 291 కుటుంబాలకు గానూ 290 ఇళ్లు నిర్మించారని హౌసింగ్ అధికారులు చెబుతున్నా, వాస్తవం మాత్రం విరుద్ధంగా ఉందని దీనిపై విచారణ చేస్తున్నామని సీఐడీ డీఎస్పీ తెలిపారు. దోషులుగా తేలితే అధికారులపైనా చర్యలు ఉంటాయన్నారు. ఇళ్ల నిర్మాణ అవినీతిలో రంగారెడ్డి జిల్లానే మొదటి స్థానంలో ఉంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆ విభాగం అధికారుల బృందం విచారణను వేగవంతం చేసింది. తాండూరు మండల పరిషత్లోని హౌసింగ్ డివిజన్ కార్యాలయంలో, పరిగి హౌసింగ్ డీఈ కార్యాలయంలో అధికారులు వివరాలు సేకరించారు. తాండూరు డివిజన్ కార్యాలయం నుంచి రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు.
Aug 12 2014 3:46 PM | Updated on Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
Advertisement
