ప్రొద్దుటూరుకు చెందిన ఈశ్వరయ్య హమాలీ పని చేస్తుంటాడు. ఆయనకు వీరేంద్ర, రవీంద్ర అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు వీరేంద్ర 6 ఏళ్ల వయసులో సరిగా నడవలేక పోవడంతో పాటు కింద పడుతుంటంతో హాస్పిటల్లో చూపిస్తే డీఎండీ వ్యాధి సోకిందని చెప్పారు. తిరుపతి, ఏలూరు తదితర హాస్పిటళ్లలో చూపించారు. చివరగా ఏలూరు హాస్పిటల్ వైద్యులు పరీక్షలు నిర్వహించి ఈ వ్యాధి నయం కాదని చెప్పడంతో తండ్రి ఈశ్వరయ్యకు ప్రాణం పోయేంత పని అయింది. ఇక చేసేదేమి లేక ఇంటికి వచ్చి వీరేంద్రను స్థానికంగా, కడప రిమ్స్లో వైద్యం చేయిస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది జూలైలో 15 ఏళ్ల వయసులో వీరేంద్ర మృతి చెందాడు. పెద్ద కుమారుడి మృతి నుంచి తేరుకొనక ముందే గుండె పగిలే వార్తను ఈశ్వరయ్య కుటుంబ సభ్యులు వినాల్సి వచ్చింది. రెండో కుమారుడు రవీంద్రకు కూడా డీఎండీ వ్యాధి ఉన్నట్లు తల్లిదండ్రులకు తెలిసింది. పెద్ద పిల్లాడి మాదిరిగానే కింద పడటం, కూర్చోలేకపోవడం తదితర లక్షణాలు కనిపించడంతో వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు డీఎండీ వ్యాధి ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం రవీంద్ర వయసు 6 ఏళ్లు. లేవలేడు.. అడుగులు వేయలేడు. స్థానిక ఆస్పత్రుల్లోనే బాలుడికి వైద్యం చేయిస్తున్నారు.


