
నేడే యువత పోరు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు సోమవారం కడప నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. పార్టీ కార్యాలయం నుంచి 10.30 గంటలకు ప్రారంభమై ర్యాలీ కలెక్టరేట్ వరకు చేరుకోనుంది. అక్కడ నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేయనున్నారు. ప్రభు త్వం ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో 35 వేల మంది నిరుద్యోగులు ఉన్నట్లు అంచనా. అలాగే సుమారు లక్ష మంది ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఉన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నిరుద్యోగులకు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయలేదు. పైగా రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వలంటీర్లను ఈ ప్రభుత్వం తొలగించింది. మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మెన్లను తొలగించారు. ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలను తీసేయడంతో ఇందులో డ్రైవర్లుగా పనిచేసే వారికి పని లేకుండా పోయింది. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారు అన్న ఆక్రోషం నిరుద్యోగుల్లో ఉంది. ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పి ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో ఖాళీలు తక్కువగా చూపారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో వారిని కాలేజీల యాజమాన్యాలు వేధిస్తున్నాయి. సర్టిఫికెట్లు ఇవ్వకుండా, ఫలితాలు ప్రకటించకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర యువజన విభాగం ఆందోళనకు పిలుపునిచ్చింది.
వైఎస్సార్ సీపీ యువజన విభాగం
ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు ర్యాలీ