
ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన బాబు
రాజంపేట టౌన్: చంద్రబాబునాయుడు ప్రజా సమస్యలను గాలికి వదిలేశాడని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆరోపించారు. మండలంలోని బాలరాసపల్లె గ్రామంలో ఎమ్మెల్యే ఆదివారం పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ యోగాంధ్ర పేరుతో మూడు వందల కోట్లకు పైగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశాడని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నా, రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. యోగాంధ్రకు చేసిన ఖర్చుతో అనేక ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవన్నారు. చంద్రబాబునాయుడు పాలన పచ్చ పత్రికల్లో తప్ప మరెక్కడా కనిపించడం లేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదయినా ఏ ఒక్క సమస్య పరిష్కరించకపోగా ఎన్నికల హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఏడాది కాకముందే ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. జగన్ ఎక్కడ పర్యటించినా ప్రజలు వేలాదిగా తరలి రావడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ప్రజల్లో జగన్కు ఉన్న స్పందన చూస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా ఒక్క సీటు కూడా సాధించలేవన్నారు.
● నందలూరుకు చెందిన రిటర్డ్ రైల్వే డాక్టర్ భాస్కర్ కుమారుడు ధీరజ్కుమార్ గత సివిల్స్ ఫలితాల్లో ర్యాంకు సాధించి మహారాష్ట్రలో ఎస్పీగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే ఆకేపాటి ఆదివారం ఆయనను ఎస్టేట్కు ఆహ్వానించి సత్కరించారు.
ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి