
కష్టపడితేనే ఉద్యోగ సాధన సాధ్యం
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6వ తేదీ నుంచి నిర్వహించే డీఎస్సీలో అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టులు సాధించాలంటే మరింత కష్టపడాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో కడప యూటీఎఫ్ భవన్లో నిరుద్యోగ డీఎస్సీ అభ్యర్థులకు 40 రోజులపాటు నిర్వహించిన ఉచిత శిక్షణ ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టులు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ బడులను కాపాడుకోవడం కోసం, నవతరంలో చైతన్య స్ఫూర్తిని నింపేందుకు యూటీఎఫ్ ఈ ఉచిత కోచింగ్ నిర్వహించిందని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డి.క్రిష్ణారెడ్డి, ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం.ప్రభాకర్, ప్రధానోపాధ్యాయురాలు సి.వనజా రెడ్డి, ఉపాధ్యాయులు నరసింహారావు, శ్రీనివాసులు ఆచారి, అభయ్, అనిల్ కుమార్, నరసింహులు, ప్రకాష్, బాషా, గౌస్ పీర్ తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
ఖాజీపేట : గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దుగ్గబోయిన భాస్కర్(34) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ఖాజీపేట మండలం నాగపట్నం వెళ్లే దారి క్రాస్ వద్ద జాతీయ రహదారిపై ఈ సంఘటన జరిగింది. పోలీసులు అందించిన వివరాల మేరకు.. గోపవరం మండలం వల్లెవారిపల్లి గ్రామానికి చెందిన దుగ్గన బోయిన భాస్కర్ (34) ఖాజీపేటలోని అగ్రహారంలో జరిగే జాతరకు వెళుతున్నానని శనివారం రాత్రి భార్య నాగేశ్వరికి చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. ఆదివారం తెల్లవారుజామున నాగపట్నం క్రాస్ వద్దకు రాగానే ఇతను నడుపుతున్న బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం పూర్తిగా దగ్ధమైంది. భాస్కర్ పైనుంచి వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని కడప రిమ్స్కు తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
వాహనాలు ఢీ
సంబేపల్లె : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై మోటకట్ల సమీపంలో ఆదివారం రాత్రి బొలేరో పికప్ వాహనం–కారు ఢీ కొన్నాయి. కడపకు చెందిన బ్యాంకు ఉద్యోగులు కారులో చిత్తూరు నుంచి కడపకు వెళుతుండగా ఎదురుగా కోళ్ల లోడుతో వస్తున్న బొలేరో పికప్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి.

కష్టపడితేనే ఉద్యోగ సాధన సాధ్యం