
చేతులెత్తేసిన కూటమి సర్కార్
జమ్మలమడుగు : రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం టీడీపీ, జనసేన, బీజేపీలు ఇష్టారాజ్యంగా హామీ ఇచ్చాయి. అందులో సూపర్ సిక్స్ పేరుతో పెట్టిన పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూర్చుతామని అసత్య ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజలకు వెన్నుపోటు పొడిచింది.. అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో మూడు మండలాలకు చెందిన పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎ స్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ప్రజలకు పథకాలు అందించారన్నారు. గతంలో బటన్ నొక్కే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేశారని, ప్రస్తుతం చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, బీజేపీలు కలిసి ప్రజలకు ఆడబిడ్డ పథకం, నిరుద్యోగభృతి, రైతులకు రూ.20వేలు ఇస్తామని చెప్పి ఇంత వరకు ఒక్కపైసా కూడా జమ చేయలేదన్నారు. సూపర్ సిక్స్తోపాటు 143 హామీలను కూటమి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. వాటిని అమలు చేయడంలో ప్రభు త్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈనెల 4వతేదీ వెన్నుపోటు దినంగా చేపట్టబోయే కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి