
ఉత్సాహంగా పసిడిపురి వసంతోత్సవం
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమంలో శనివారం నటరాజకళాక్షేత్రం నాట్య విశారద మోహిద్దీన్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పసిడిపురి వసంతోత్సవం ఉత్సాహంగా సాగింది. ప్రొద్దుటూరు, కడప, రాజంపేట, వేంపల్లె తదితర ప్రాంతాలకు చెందిన చిన్నారులు ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొని తమ నాట్య నైపుణ్యంతో అందరిని అలరించారు. 100 మంది చిన్నారులకు ఈ సందర్భంగా అయోధ్య బాలరామ అవార్డులను, ప్రశంశా పత్రాన్ని పంపిణీ చేశారు. అలాగే పలువురు నాట్యగురువులకు ‘నాట్య వతంస’ అవార్డులను అందించి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా నాట్యగురువు మోహిద్దీన్ ఖాన్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షణలో భాగంగా తాము ఈ కార్యక్రమాన్ని ‘పసిడిపురి వసంతోత్సవం 2025’ పేరుతో ఘనంగా నిర్వహించామన్నారు. మానవజాతి ఆవిష్కరించుకున్న అనేక కళల్లో నాట్యం ఒకటని నాట్యం ప్రాముఖ్యతను వివరించారు. ఇటీవలి కాలలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు సాంప్రదాయ నృత్యాలను నేర్పించేందకు ఆసక్తి కనపరుస్తుండటం సంతోషకమన్నారు. కళలను ఆదరించి పోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పలువురు చిన్నారులు చేసిన కూచిపూడి, భరతనాట్యం జానపద నృత్యం, సంగీతం, సెమిక్లాసికల్, సోలో, గ్రూప్ విభాగాలలో చిన్నారులు చేసిన నృత్యాలను ఆహుతులు ఆసక్తిగా తిలకించారు. అలాగే వేసవి శిక్షణా శిబిరంలో శిక్షణ పొందిన చిన్నారుల బృంద నృత్యం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. ఉదయం ప్రారంభమైన ఈ వసంతోత్సవం వేడుక రాత్రి 9 వరకు జరిగింది. కార్యక్రమంలలో పలు ప్రాంతాలకు చెందిన నాట్య గురువులు, కళాకారులు, కళాభిమానులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
100 మందికి అయోధ్య బాలరామ
అవార్డులు ప్రదానం