
రైలు ఢీకొని యువతికి తీవ్ర గాయాలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ పరిఽధిలోని ముకుందాశ్రమం వద్ద రైలు పట్టాలపై నడిచి వెళుతున్న ఆవారి చందు అనే యువతిని రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిందని ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాసులు, ఎర్రగుంట్ల, నందలూరు ఎస్ఐలు త్రివేణి తెలిపారు. స్థానికంగా ఉన్న శివాలయంలో అభిషేకం చేయాలని ఆ యువతి కుటుంబం భావించి పూజా సామగ్రికి సంబంధించిన వివరాలను సేకరించేందుకు యువతి శివాలయంకు వెళ్లిందన్నారు. తిరిగి వచ్చే సమయంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. సంఘటన స్థలం వద్ద ఫేస్ మాస్క్, పాదరక్షలను చూసి యువతిని గుర్తించామన్నారు. కుటుంబ సభ్యులు గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం కడపకు, ఆ తర్వాత మెరుగైన వైద్య సేవల కోసం తిరుపతికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ కొంతమంది పట్టాలు దాటే సమయంలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని పాటలు వింటూ వెళుతున్నారని, ఆ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాంటి చర్యలను విడనాడాలని ఆయన సూచించారు.