
‘వెన్నుపోటు’ దినం.. కదం తొక్కుదాం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జూన్ 4న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా కడపలోని పార్టీ కార్యాలయంలో కడప పార్లమెంటు పరిశీలకులు కె.అజయ్రెడ్డి, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి, మేయర్ కె.సురేష్ బాబు, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, పి. రామసుబ్బారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తొలుత పి.రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. 2025 జూన్ నాటికి ఏడాది పూర్తవుతుందని, ఈ ఏడాది కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. సూపర్ సిక్స్తోపాటు 143 ఇతర హామీలు ఇచ్చి ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. దీన్ని నిరసిస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజల భాగస్వామ్యంతో ర్యాలీలు చేపట్టి, అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
మహానాడుకు డ్వాక్రా మహిళల తరలింపు
రాష్ట్రంలో ప్రజల అవసరాలు గుర్తెరిగి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దివంగత ఎన్టీఆర్, వైఎస్సార్ ట్రెండ్ సెట్టర్స్గా నిలిచారని, వారి తర్వాత అనేక వినూత్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు. సుమారు 20 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క సంక్షేమ పథకం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అంటే మోసం, దగా, వెన్నుపోటు, అబద్ధాలే గుర్తుకు వస్తాయన్నారు. ఎన్నికల ముందు చదువుకునే ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. పైగా వలంటీర్లు, రేషన్ వాహనాల డ్రైవర్ల ఉద్యోగాలు ఊడగొట్టారన్నారు. ఆత్మస్తుతి పరనిందలాగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుని, వైఎస్ జగన్ను తిట్టడానికే మహానాడు కార్యక్రమాన్ని కడపలో ఏర్పాటు చేశారన్నారు. మహానాడుకు డ్వాక్రా మహిళలను, ఉపాధి కూలీలను భయపెట్టి బస్సుల్లో తరలించారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రతి ఒక్కరూ రాసుకుంటున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
కరోనా విస్తరిస్తుందని చెబుతున్నా..
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని ప్రజలు బాధపడుతున్నారన్నారు. సంపద సృష్టిస్తా, పేదలను ధనవంతులుగా చేస్తా, అభివృద్ధిని అందలం ఎక్కిస్తానంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారని, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటేలా చేశారన్నారు. కరోనా విస్తరిస్తుందని చెబుతున్నా వినకుండా మహానాడు నిర్వహించారన్నారు. ప్రయాణికులకు బస్సులు లేకుండా చేసి మహానాడుకు అన్ని బస్సులు తరలించారన్నారు. 50 ఏళ్లుగా ఈ జిల్లా ప్రజలు వైఎస్ కుటుంబాన్ని గెలిపిస్తూ వస్తున్నారని, ఒక్కసారి గెలిపించినందుకే ఇది మా అడ్డా అని టీడీపీ నాయకులు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ వెళ్లి చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, నాయకులు పులి సునీల్, సంబటూరు ప్రసాద్రెడ్డి, దాసరి శివప్రసాద్, షఫీ తదితరులు పాల్గొన్నారు.
4న అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు
ప్రజల భాగస్వామ్యంతో వైఎస్సార్సీపీ ర్యాలీలు
జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన పార్టీ నేతలు
సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికే ‘మహానాడు’ నిర్వహించారని విమర్శ