
నేటి నుంచి ‘వికసిత్ కృషి’ యాత్రలు
కడప అగ్రికల్చర్: జిల్లాలో రైతులు మంచి వ్యవసాయ దిగుబడిని పెంచడానికి శాస్త్రవేత్తలు, రైతులను అనుసంధానించే లక్ష్యంతో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ (వీకేఎస్పి) యాత్రలు ఉమ్మడి కడప జిల్లాలో మే 29 నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్నట్లు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డా. ఎ.వీరయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం, వ్యవసాయ మంత్రిత్వ శాఖ , భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఎల్ఆర్) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఊటకూరు కృషి విజ్ఞాన కేంద్రం ఉమ్మడి కడప జిల్లాలోని 26 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు కొత్త విత్తన రకాలు, వినూత్న వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. అలాగే రైతులకు స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై మార్గనిర్దేశం చేయడం, ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ దిగుబడిని పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలను రూపొందిస్తామని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.