
ఆగిన వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులు
రాయచోటి టౌన్ : రాయచోటికే తలమానికంగా నిలిచిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం అభివృద్ధి పనులు ఆగిపోయాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధి కోసం రూ. కోట్లు ఖర్చు చేశారు. అలాంటిది ఇప్పుడు ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదు. ప్రధానంగా వీరభద్రస్వామి ఆలయానికి చెందిన పనుల్లో స్వామి వారి ఆలయానికి పడమర దిక్కున ప్రహరీకి ఆనుకొని ఉన్న ఆక్రమణల తొలగింపు అంశాన్ని అప్పటి ఎమ్మెల్యే, చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి ఎంతో చాకచక్యంగా పరిష్కరించారు. అంతేకాకుండా వారికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఇంటి స్థలాలు కూడా కేటాయించి ఇళ్ల నిర్మాణాలకు సహకరించారు. ఆ వెంటనే పశ్చిమ రాజగోపురం రూ.158 కోట్లతో నిర్మించారు. అలాగే గర్భాలయంపై పిడుగు పడటంతో 2020లోనే మళ్లీ రూ.33 లక్షలతో పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు. అనంతరం రూ.38 లక్షలతో మాఢవీధులు నిర్మించారు. చివరగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఐదు అంతస్తుల భవనాలు నిర్మించేందుకు రూ.1.58 కోట్లతో 2023 జనవరి 26న పనులు ప్రారంభించారు. మూడు అంతస్తుల వరకు గోడలు కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పనులు ఆగిపోయిన విషయమై ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డిని వివరణ కోరగా నూతన కమిటీ ఏర్పడ్డాక మిగిలిన పనులు పూర్తి చేయిస్తామన్నారు.
యోగాంధ్రకు సర్వం సిద్ధం
మదనపల్లె రూరల్ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మదనపల్లెలో బుధవారం నిర్వహించనున్న జిల్లా స్థాయి మెగా యోగాకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జేసీ ఆదర్శ రాజేంద్రన్, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్.. పట్టణంలోని బెంగళూరు రోడ్డు బీటీ కాలేజీ గ్రౌండ్స్లో యోగా కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు. మైదానంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. యోగా ట్రైనర్, ఆసనాలకు సంబంధించి చెప్పే మాటలు అందరికీ వినపడేలా సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. యోగాలో పాల్గొనే అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, హెల్పర్లు, ఏఎన్ఎంలు, మెడికల్ అధికారులు, ఆశా కార్యకర్తలు క్రమశిక్షణతో సంఘటితంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.