టీడీపీలో ఫ్లెక్సీల రగడ | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో ఫ్లెక్సీల రగడ

May 26 2025 12:30 AM | Updated on May 26 2025 12:30 AM

టీడీపీలో ఫ్లెక్సీల రగడ

టీడీపీలో ఫ్లెక్సీల రగడ

సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో వర్గవిభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఇప్పటికే కడపలో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. కొందర్ని సాగనంపాలనే యోచనలో వ్యూహాత్మకంగా ఓ వర్గం అడుగులు వేయగా, అదే స్థాయిలో ప్రతిఘటిస్తూ వైరిపక్షం ప్రశ్నలను సంధించింది. బాధ్యులు స్పందించకపోగా, కేడర్‌ను ఉసిగొల్పారు. ఇలాంటి పరిస్థితిలో తాజాగా ఫ్లెక్సీల రగడ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే మాధవీరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఊటుకూరు బ్రిడ్జి నుంచి రింగు రోడ్డు వెంట పెట్టిన ఫ్లెక్సీలను ఏకంగా కోసేశారు. ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ లేదని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.

ముందుగా ఎవరు ఆక్రమిస్తే..

మహానాడు సందర్భంగా కడప నగరం పసుపు మయమైంది. నగరంలో భారీ స్థాయిలో పసుపు జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలు వెలిశాయి. కార్పొరేషన్‌కు పైసా చెల్లించకుండానే వీటిని ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగా ఎవరు జాగా ఆక్రమిస్తే.. వారిదే ఫ్లెక్సీ అన్నట్లుగా నేతలు ఉండిపోయారు. ఈక్రమంలో ఎయిర్‌పోర్టు నుంచి రింగురోడ్డు వెంట కూడా భారీ స్థాయిలో ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో ప్రధానంగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఫ్లెక్సీలే ఉండిపోయాయి. ఇతర నియోజకవర్గాల నేతలకు ఆస్కారం లేకుండా ఏర్పాటు చేశారు. కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో కూడా.. ఆ దంపతుల ఫ్లెక్సీలే వెలిశాయి. కాగా ఆదివారం ఉదయానికి ఎమ్మెల్యే మాధవీరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఫ్లెక్సీలు ఏకంగా కోతకు గురయ్యాయి.

వర్గ విభేదాలేనా... ఫ్లెక్సీల ఆధిపత్యమా?

నగర తెలుగుదేశంలో పూర్తి స్థాయిలో వర్గ విభేదాలు ఉన్నాయి. అలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి కుటుంబాన్ని టీడీపీ నుంచి దూరం చేసేందుకు చర్యలన్నీ పూర్తి అయ్యాయి. అదే స్థాయిలో కార్పొరేటర్‌ ఉమాదేవితో సహా.. ఎమ్మెల్యే మాధవీరెడ్డి, శ్రీనివాసులరెడ్డి చర్యలపై తీవ్రస్థాయిలో వారు కూడా ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఫ్లెక్సీల ధ్వంసరచన వారిపైకి నెట్టేందుకు ఎవరైనా చేశారా? అనే అనుమానాలు లేకపోలేదు. మరోవైపు కడపతోపాటు కమలాపురం పరిధిలో కూడా ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫ్లెక్సీల ఆధిపత్యం ప్రదర్శించారు. అక్కడి తెలుగుతమ్ముళ్లకు ఆగ్రహం వచ్చి.. ప్రత్యక్ష చర్యలకు పాల్పడ్డరాని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీలో సఖ్యత లేదనడానికి ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడి ఫ్లెక్సీల ధ్వంసం నిదర్శనంగా నిలుస్తుండటం గమనార్హం.

ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫ్లెక్సీలు ధ్వంసం

ముందస్తుగా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు

మరొకరికి అవకాశం లేకుండా ప్రధాన ప్రాంతాల్లో ఆక్రమణ

కార్పొరేషన్‌కు పైసా చెల్లించకుండానే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement