
‘మహానాడు’కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
కడప అర్బన్ : జిల్లాలో ఈ నెల 27 నుంచి జరగనున్న ‘మహానాడు’కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీస్ అధికారులను శనివారం ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు అంశాలపై పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘మహానాడు’కు పలువురు వీవీఐపీలు, వీఐపీలు, పెద్ద ఎత్తున ప్రజలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ పరంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, పార్కింగ్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ను ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లేలా మళ్లించాలని ఆదేశించారు. పకడ్బందీగా రూట్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ అధికారులకు కేటాయించిన విధులను అప్రమత్తంగా ఉంటూ నిర్వర్తించాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) ఎన్.మధుసూదన్ రెడ్డి, కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షెముషి బాజ్ పేయి, వైఎస్సార్ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, కర్నూలు జిల్లా ఎస్పీవిక్రాంత్ పాటిల్, అన్నమయ్య ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, అనంతపురం ఎస్పీ పి.జగదీశ్, గుంతకల్ రైల్వే ఎస్పీ రాహుల్ మీనా, అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ అధికారులకు
డీజీపీహరీష్ కుమార్ గుప్తా దిశానిర్దేశం