
చోరీకి గురైన బైక్లు స్వాధీనం
జమ్మలమడుగు రూరల్ : ద్విచక్ర వాహనదారులు తమ బైక్లను ఎక్కడపడితే అక్కడ పెట్టకుండా వాహనాలకు రక్షణ ఉండే చోట పెట్టుకోవాలని జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం అర్బన్ పోలీస్ స్టేషన్లో సీఐ లింగప్పతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కొంత కాలం నుంచి పట్టణంలోని రైల్వేస్టేషన్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న మోటార్ బైక్లు అలాగే ప్రొద్దుటూరు ప్రాంతంలో వివిధ స్థలాల్లో పార్కింగ్ చేసిన సుమారు 16 మోటారు బైక్లు చోరీకి గురయ్యాయన్నారు. గత నెల 26వ తేది జమ్మలమడుగు మండలంలోని ఎన్.కొట్టాల గ్రామానికి చెందిన బొందల సుధీర్ అనే వ్యక్తి కడపకు వెళుతూ తన బైక్ను రైల్వేస్టేషన్ వద్ద పార్కింగ్ చేసి వెళ్లాడన్నారు. తిరిగి వచ్చి చూడగా బైక్ కనిపించలేదన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. గురువారం బైపాస్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి పారిపోతుండగా పట్టుకొని విచారించగా నంద్యాల జిల్లా చాగలమర్రి (పెద్ద మకాన్) గ్రామానికి చెందిన ముత్యాలపాటి దాదావలీగా గుర్తించారు. గత కొంత కాలంగా 16 బైక్లను చోరీ చేసి వాటిలో రెండు బైక్లను విడి భాగాలుగా చేసి విక్రయించినట్లు తెలిసిందన్నారు. వీటి విలువ సుమారు రూ. 10 లక్షలు అవుతుందని ఆయన తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. మోటార్ బైక్లను రికవరీ చేసిన సీఐ లింగప్ప, ఎస్ఐ రామక్రిష్ణ, సిబ్బంది రియాజ్, దేవదాసు, నాగేంద్రలను డీఎస్పీ అభినందించారు.