
12న షర్మిల రాక
కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లాకు ఈ నెల 12న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వస్తున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి పేర్కొన్నారు. నగరంలోని ఇందిరాభవన్లో పార్టీ కోఆర్డినేటర్లు, డీసీసీ కమిటీ సభ్యులు, మండల ప్రెసిడెంట్లు, మైనారిటీ నాయకులతో ఆమె గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడపలోని ఐఎంఏ హాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ పదవులు పొందిన నాయకులతో వ్యక్తిగతంగా షర్మిల క్షేత్ర, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చిస్తారని చెప్పారు. కష్టపడి పని చేసే నాయకులకు పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారిని కార్యాలయంలోకి కూడా అనుమతించరన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వన మహోత్సవానికి శ్రీకారం
కడప ఎడ్యుకేషన్: ‘హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా ఈ నెల 5 నుంచి కార్తీక మాసం వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వన మహోత్సవాన్ని యోగివేమన యూనివర్సిటీ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం ప్రారంభించారు. జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్, గౌరవ అతిథులుగా డీఎఫ్ఓ వినీత్ కుమార్ (టెరిటోరియల్), డీఎఫ్ఓ (సామాజిక వన్య అటవీ సంరక్షణ), కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, వైవీయూ రిజిస్ట్రార్ పుత్తా పద్మ, డ్వామా పీడీ అదిశేషారెడ్డి, డీపీవో రాజ్యలక్ష్మి హాజరై అడవి జాతి మొక్కలు నాటి ‘హరితాంధ్ర ప్రదేశ్’ లక్ష్య సాధనకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవం గురించి వివరించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో విశిష్టమైన సేవలు అందించిన మధుసూదన్రెడ్డి, (బోటనీ ప్రొఫెసర్), అంకాల్, మునెయ్య, ద్వారకా నాథరెడ్డి, లక్ష్మిరెడ్డిలు సమాజ హితం కోసం చేసిన సేవలను ప్రశంసిస్తూ వారికి అవార్డులను బహుకరించారు. ఈ కార్యక్రమంలో యోగి వేమన యూనివర్సిటీ, అటవీశాఖ, డ్వామా, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.