
ప్రజలే తిరగబడే రోజులొస్తున్నాయి
కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇలాగే కొనసాగిస్తూ పోతే.. ప్రజలు ఎదురుదాడి చేసే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి హెచ్చరించారు. గురువారం సాయంత్రం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డితో కలిసి జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెల ఆరో తేదీన పేకాట ఆడుతున్నారని 12 మందిపై ఖాజీపేట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అందులో వైఎస్సార్సీపీ కార్యకర్త రెడ్యం లక్ష్మినారాయణరెడ్డిని ఏ3గా చేర్చారన్నారు. రెడ్హ్యాండెడ్గా పోలీసులు పట్టుకోలేదని, పోలీస్స్టేషన్కు పిలిపిస్తే వారు వెళ్లారన్నారు. మూడు రోజులపాటు స్టేషన్లో చితక్కొట్టి 9వ తేదీన గంజాయి కేసు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. ఇటీవల అతను జైలు నుంచి విడుదలై వచ్చి నిన్న(మంగళవారం) వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడన్నారు. లక్ష్మినారాయణరెడ్డి చాలా సున్నిత మనస్కుడని, అతనికి ఇది వరకు నేరచరిత్ర లేదన్నారు. పోలీసులు అసత్య సమాచారంతో తప్పుడు కేసు నమోదు చేసి చిత్రహింసలకు గురిచేశారన్నారు. ఇలా హింసించే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని, ఎవరి వత్తాసుతో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తమ చేతగాక అవినీతి పోలీసులను అడ్డుపెట్టుకొని వేధిస్తున్నారని, వారిపై ప్రైవేటు కంప్లైంట్ ఇచ్చామన్నారు. లక్ష్మినారాయణరెడ్డి మృతదేహంతో పోలీస్స్టేషన్ వద్దే ఆందోళన నిర్వహించాలని అనుకున్నామని, జిల్లా ఎస్పీ కేసు నమోదు చేసి విచారణ చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించుకున్నామని తెలిపారు.
పోలీసులు లక్షల రూపాయలు
డిమాండ్ చేశారు : అంజద్బాషా
లక్షల రూపాయలు ఇవ్వాలని లక్ష్మినారాయణరెడ్డిపై ఖాజీపేట పోలీసులు ఒత్తిడి చేశారని, అతన్ని తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురి చేశారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా ఆరోపించారు. ప్రజల బాగోగుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ వారిని అవమానిస్తోందన్నారు. రోడ్డుపై పూలు అమ్ముకునే వ్యక్తిని లక్షల రూపాయలు డిమాండ్ చేశారన్నారు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా డబ్బుల కోసం తీవ్రంగా వేధించారన్నారు. వారి వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. సీఐపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు న్యాయం చేయకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
అవమానం జరిగాక బతికి ఉపయోగం లేదనే ఆత్మహత్య : రెడ్యం
పోలీసులు గంజాయి కేసు పెట్టడంపై లక్ష్మినారాయణరెడ్డి తీవ్ర అవమానంగా భావించాడని, ఇంత అవమానం జరిగిన తర్వాత బతికి లాభం లేదనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. పోలీసులు అతన్ని పదే పదే స్టేషన్కు పిలిపించి కొట్టారని, పిలిపించిన ప్రతి సారీ డబ్బు రాబట్టారన్నారు. జైల్లో కూడా తీవ్ర అవమానాలకు గురయ్యాడన్నారు. మృతుడికి ఆరో తరగతి చదివే పిల్లలు ఉన్నారని, వారికి ఇప్పుడు భద్రత, రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్ కుమార్ పాల్గొన్నారు.
లక్ష్మినారాయణరెడ్డిని హింసించిన సీఐపై కేసు నమోదు చేయాలి
లేనిపక్షంలో వైఎస్సార్సీపీఆధ్వర్యంలో ఆందోళనలు
మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి హెచ్చరిక
పార్టీ నేతలతో కలిసి ఎస్పీకి వినతిపత్రం