
250 కి పైన జనాభా ఉన్న గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ
కడప సెవెన్రోడ్స్ : సరైన రహదారి సౌకర్యం లేక ఎన్నో ఏళ్లుగా అవస్థలు ఎదుర్కొంటున్న జిల్లాలోని కుగ్రామాలకు ఇక మహర్దశ పట్టనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 250కి పైబడిన జనాభా ఉన్న గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించనున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్దిశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై)–4కు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేశారు. దీంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కృషి ఫలించినట్లయింది.
ఇప్పటివరకు జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లె, సీకే దిన్నె, రైల్వేకోడూరు బ్లాకులకే ఈ సౌకర్యం అందుబాటులో ఉండేది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గుర్తించిన ఆకాంక్షిత జిల్లాల్లో కడప ఒకటి. కనుక 250 పైబడి జనాభా కలిగిన గ్రామాలకు సైతం పీఎంజీఎస్వై–4 మార్గదర్శకాలు వర్తించే విధంగా చూడాలని కోరుతూ కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కమలేష్ పాశ్వాన్కు లేఖ రాశారు. అదే విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రికి స్వయంగా వివరించారు. పరిశీలించిన కేంద్ర మంత్రి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి లేఖపై స్పందించారు. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగామ్ కింద జిల్లా ఉన్నందున 250 పైబడి జనాభా కలిగిన గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. పీఎంజీఎస్వై–4 కింద ఈ అంశాన్ని చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సైతం ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎక్కడైనా ఇది సాధ్యపడకపోతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏదో ఒక పథకం కింద చేపట్టాలని కేంద్ర మంత్రి తన ఉత్తర్వుల్లో కోరారు. పీఎంజీఎస్వై–4 మార్గదర్శకాలు విడుదల కావడంతో ఉమ్మడి జిల్లాలో మిగిలిన 46 బ్లాకులలోని 250+ జనాభా గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నారు. తద్వారా కోట్లాది రూపాయాలు నిధులు గ్రామీణ రహదారుల కనెక్టివిటీకి విడుదల కానున్నాయి.
జిల్లాలో 22 గ్రామాలకు ఉపయోగం...
ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి లేఖ ఫలితంగా ఉమ్మడి జిల్లాలో 22 గ్రామాలకు కనెక్టివిటీ రహదారులకు అవకాశం ఏర్పడింది. వెరశి రూ.32.05 కోట్లుతో కనెక్టివిటీ రహదారులు నిర్మించనున్నారు. కడప పార్లమెంటు పరిధిలో 17 రహదారులకు రూ.21.35 కోట్లు, రాజంపేట పార్లమెంటు పరిధిలోని మూడు నియోజకవర్గాలకు 5 రహదారులకు రూ.10.7 కోట్లుతో కనెక్టివిటీ రహదారులు ఏర్పాటు చేయనున్నారు.
పీఎంజీఎస్వై–4 కింద
మార్గదర్శకాలు జారీ
ఫలించిన ఎంపీ
వైఎస్ అవినాష్రెడ్డి కృషి