
చోరీ జరిగిన ఏటీఎంను పరిశీలించిన ఎస్పీ
హుజూర్నగర్: హుజూర్నగర్ పట్టణంలో చోరీ జరిగిన ఎస్బీఐ ఏటీఎంను సోమవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన దొంగతనం జరిగిన తీరు, కేసు దర్యాప్తు వివరాలను సీఐ చరమంద రాజును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పట్టణంలోకి సీసీ కెమెరాలు పరిశీలించి చోరీకి పాల్పడిన వారిని వెంటనే గుర్తించాలని పోలీసులకు సూచించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత నెల బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి ఏటీఎంలు, బ్యాంకుల వద్ద సెక్యూరిటీని, సీసీ కెమెరాలను బలోపేతం చేసుకోవాలని సూచించినట్లు గుర్తుచేశారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
నార్కట్పల్లి: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం నార్కట్పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం పామనగుండ్ల గ్రామానికి చెందిన చెరుకు మహేష్(24) ద్విచక్ర వాహనంపై నార్కట్పల్లిలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చాడు. కూరగాయలు తీసుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. నార్కట్పల్లి మండల కేంద్రంలోని చైతన్య ఆస్పత్రి ఎదుట మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో మహేష్ పక్కనే ఉన్న డివైడర్కు ఢీకొనడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఆటో ఢీకొని వృద్ధుడు మృతి
మోత్కూరు: ఆటో ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండలం కమ్మగూడేనికి చెందిన తిప్పబత్తిని రాజయ్య(63) సోమవారం పాటిమట్ల గ్రామంలోని స్కూల్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా.. మోత్కూరు నుంచి వస్తున్న ఆటో పల్టీ కొట్టి రాజయ్యను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజయ్యకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని భువనగిరి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
చెన్నాయిపాలెం విద్యార్థికి 238వ ర్యాంకు
మఠంపల్లి: మండలంలోని చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన భూక్యా రవీందర్, సీతమ్మ దంపతుల కుమారుడు కోటేష్ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్టీ కేటగిరీలో 238వ ర్యాంకు సాధించాడు. మారుమూల గిరిజన తండాకు చెందిన కోటేష్ అత్యుత్తమ ర్యాంకు సాధించడంతో గ్రామ పెద్దలు అభినందించారు.

చోరీ జరిగిన ఏటీఎంను పరిశీలించిన ఎస్పీ