
షిర్డీ వెళ్లొస్తూ మృత్యు ఒడిలోకి..
● కారులో మంటలు చెలరేగడంతో సజీవ దహనమైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు
నల్లగొండ, మాడ్గులపల్లి: షిర్డీ వెళ్లి తిరిగి వస్తుండగా కారులో మంటలు చెలరేగి ప్రభుత్వ ఉపాధ్యాయుడు సజీవ దహనమయ్యాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని ఏచూరి గార్డెన్స్ సమీపంలో నివాసముంటున్న పెంటవల్లి సురేష్కుమార్(48) తన స్నేహితుడితో కలిసి కారులో షిర్డీకి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఆదివారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని ఉమ్నాబాద్ జిల్లా వద్దకు రాగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్తో పాటు సురేష్కుమార్ స్నేహితుడు క్షేమంగా బయటపడగా.. సురేష్కుమార్ మాత్రం మంటల్లో కాలి సజీవ దహనమయ్యాడు. సురేష్కుమార్ నల్ల గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చెర్వుపల్లి జెడ్పీహెచ్ఎస్లో భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతడి భార్య జ్యోతి వైద్యశాఖలో ఎక్స్రే టెక్నీషిన్గా పనిచేస్తోంది. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారిద్దరు ఇద్దరు డాక్టర్లే కాగా.. కుమార్తె వివాహం అయ్యింది. సురేష్ నల్లగొండలో ఉంటుండగా.. జ్యోతి తన పిల్లలతో కలిసి హైదరాబాద్లో ఉంటోంది. సురేష్ అంత్యక్రియలు సోమవారం నల్లగొండలో నిర్వహించారు.
టిప్పర్ను ఢీకొట్టిన బైక్
● కుమారుడు మృతి, తండ్రికి తీవ్ర గాయాలు
మర్కూక్(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందగా, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములర్తి గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. ములుగు ఎస్ఐ దామోదర్ కథనం మేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కొండారెడ్డిచెరువు గ్రామానికి చెందిన కర్రె కనకయ్య(33), కుమారుడు కర్రె జీవన్ (13) ఇద్దరూ వ్యాపారం నిమిత్తం కూరగాయలు కొనుగోలు చేసేందుకు బైక్పై ములుగు మండలంలోని వంటిమామిడి మార్కెట్కు వచ్చారు. కూరగాయలు కొనుగోలు చేసుకొని తిరిగి వెళ్తుండగా మండలంలోని పాములపర్తి గ్రామ శివారులో ముందు వెళ్తున్న టిప్పర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే 108 అంబులెన్స్లో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే జీవన్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కనకయ్యను మెరుగైన వైద్యం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

షిర్డీ వెళ్లొస్తూ మృత్యు ఒడిలోకి..