
చెన్నకేశ్వరస్వామి దేవాలయంలో చోరీ
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్లో గల చెన్నకేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గుండ్ల రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి చెన్నకేశ్వరస్వామి ఆలయం గేటుకు వేసిన తాళంతో పాటు గర్భగుడి తాళాలను పగులగొట్టి లోనికి వెళ్లి హుండీలోని నగదుకు ఎత్తుకెళ్లారు. హుండీని ఆలయ సమీపంలోని ఓ రైతు పొలంలో పడేశారు. గురువారం ఉదయం కారింగు బాలయ్య గుడిని శుభ్రం చేసేందుకు వెళ్లగా.. ఆలయం గేటుకు వేసిన తాళాలు పగులగొట్టి ఉండటం గమనించి గ్రామస్తులకు సమచారం ఇచ్చాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఇన్చార్జి ఎస్ఐ జగన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. హుండీలో సుమారు రూ.50వేల నగదు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇదే దేవాలయంలో గతంలో కూడా దొంగలు చోరీకి పాల్పడి అమ్మవారి మెడలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు.