విత్తన ఎంపికే కీలకం | - | Sakshi
Sakshi News home page

విత్తన ఎంపికే కీలకం

May 30 2025 1:11 AM | Updated on May 30 2025 1:11 AM

విత్త

విత్తన ఎంపికే కీలకం

సాక్షి, యాదాద్రి: పంట ఏదైనా విత్తన ఎంపికే కీలకం. నాణ్యత, చీడపీడలను తట్టుకునే గుణం కలిగి, అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను ఎంచుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ) గోపాల్‌ రైతులకు సూచించారు. గురువారం శ్రీసాక్షిశ్రీఫోన్‌ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనిల్‌కుమార్‌, మధుశేఖర్‌తో కలిసి పాల్గొన్నారు. పంటల సాగులో సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. విత్తనాల కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, లైసెన్డ్‌ డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా రశీదు పొందాలని సూచించారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశంతో ముందస్తుగానే వర్షాలు కురుస్తున్నాయని, ఇవి సాగుకు అనుకూలమే అయినప్పటికీ ఇప్పుడే విత్తనాలు విత్తవద్దన్నారు. భూమిలో వేడిమికి విత్తనాలు మాడిపోయే ప్రమాదం ఉందని, భారీ వర్షం కురిసిన తరువాత విత్తుకుంటే మంచింది. జూన్‌ 15 వరకు విత్తనాలు విత్తుకోవచ్చు.

ప్రశ్న : వరిలో కలుపు నివారణకు ఏ మందులు వేయాలి? – వేణుగోపాల్‌రెడ్డి, వంగాల

డీఏఓ : కలుపు నివారణకు ముందస్తుగా బుటాక్లోర్‌, బుటాక్లోర్‌, 2,4 డీఈఈ మిశ్రమం, అనిలోఫోస్‌ వాడాలి. కలుపు అధికంగా ఉన్నప్పుడు 2,4–డి సోడియం సాల్ట్‌ 80 శాతం పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. గడ్డి జాతి మొక్కల నివారణకు సైహాలోఫాప్‌ బుటైల్‌, వెడల్పు పత్రాలు కలిగిన కలుపు మొక్కల నివారణకు బిస్పైరిబాక్‌ సోడియం వాడవచ్చు.

ప్రశ్న: వరిలో కొత్త రకం వంగడాలు వచ్చాయా?

– పాండురెడ్డి, భూదాన్‌పోచంపల్లి

డీఏఓ: ఆర్‌ఎన్‌ఆర్‌ధన్‌ 75, భాగ్యనగర్‌ సోనా వంగడాలను ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విద్యాలయం రూపొందించింది. భాగ్యనగర్‌ సోనా మధ్యస్థ సన్నరకం వంగడాలకు మంచి డిమాండ్‌ ఉంది. ఎకరాకు 68 బస్తాల దిగుబడి వస్తుంది. ఇంకా మార్కెట్‌లోకి ఇంకా రాలేదు.

ప్రశ్న: హైబ్రిడ్‌ గ్రేడ్‌–ఏ, గ్రేడ్‌–బి వరి సాగు చేస్తాం. కొనుగోలు సమయంలో గ్రేడ్‌–బిగా పరిగణిస్తున్నారు. – నర్సిరెడ్డి, భూదాన్‌పోచంపల్లి

జవాబు: ఏ విత్తనం సాగు చేస్తే అదే రకం వస్తుంది. కోత సమయంలో వేర్వేరుగా నూర్పిడి చేయాలి.

ప్రశ్న: బీపీటీ విత్తనాలు ఎప్పుడు పోసుకోవాలి?

– లింగయ్య, గుండాల

డీఏఓ: బీపీటీ నారు పోసుకోవడానికి ప్రస్తుతం అనువైన సమయం.

ప్రశ్న: పెసర, పల్లి కిట్‌లు ఎప్పుడొస్తాయి?

– వెంకటేశం, బ్రాహ్మణపల్లి

డీఏఓ: త్వరలో వచ్చే అవకాశం ఉంది. రాగానే రైతులకు సమాచారం ఇస్తాం.

ప్రశ్న: విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రశీదు ఇవ్వడం లేదు. – కొండల్‌, యాదగిరిగుట్ట

డీఏఓ: రశీదు ఇవ్వకుంటే అధికారులకు సమచారం ఇవ్వాలి. హెచ్‌టీ విత్తనాలు విక్రయించినా, రైతులు కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరం.

ప్రశ్న: నాణ్యమైన విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉంటాయి? – కొడారి వెంకటేఽశం

జిల్లా వినియోగ దారుల సంఘం అధ్యక్షుడు

డీఏఓ: లైసెన్స్‌డ్‌ డీలర్ల వద్ద మాత్రమే నాణ్యమైన విత్తనాలు లభిస్తాయి. నకిలీ విత్తనాలు కొనుగోలు చేయవద్దని ఇప్పటికే రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నాసిరకం విత్తనాలను విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: కుసుమ పంట వేయాలనుకుంటున్న. ఏ సీజన్‌లో సాగు చేయాలి. –పైళ్ల యాదిరెడ్డి, ముషిపట్ల

డీఏఓ: కుసుమ పంట రబీలో సాగు చేయాలి. చలి వాతావరణానికి మంచి దిగుబడి వస్తుంది. వానాకాలంలో కూడా వేయొచ్చు. అయితే చేలో నిరుల నిల్వ ఉండకుండా చూడాలి. ఎర్ర చెల్క నేలలు అనుకూలం.

ప్రశ్న: అల్లం సీడ్‌ ఎక్కడ దొరుకుతుంది, ఎలా సాగు చేయాలి?

–సోమిరెడ్డి, సుద్దాల

డీఏఓ: జహీరాబాద్‌, నిజామాబాద్‌లో అల్లం కొమ్ములు లభిస్తాయి. భూమిని దున్నిత తర్వాత ముందుగా కాల్వల పొదలు చేయాలి. అరు నెలల పంటకాలం.

హెచ్‌టీ కాటన్‌ సీడ్‌ వేయొద్దు

మూసీ ఆయకట్టుకు

కొత్త రకం వంగడాలు

సరైన వర్షాలు కురిసిన తరువాతే

విత్తనాలు వేయాలి

‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌లో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్‌, శాస్త్రవేత్తలు అనిల్‌కుమార్‌, మధుశేఖర్‌

పంటల సాగులో రైతులకు సలహాలు, సూచనలు, సందేహాల నివృత్తి

ప్రశ్న: వేర్వేరు ప్రాంతాల్లో భూమి ఉంటే

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ కావడం లేదు.

– కొల్లోజు సోమనర్సింహాచారి,

రామన్నపేట, సతీష్‌, మోత్కూరు

డీఏఓ: వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూములు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ కావడం లేదని మా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక అందజేసాం. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది. రైతు సంక్షేమ పథకాలు వర్తింపచేయడం కోసం ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇందులో నమోదైతేనే పథకాలు అందుతాయి. రైతులందరై ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ఎటువంటి సమస్య ఎదురైనా వెంటనే వ్యవసాయ అధికారుల దృష్టికి తేవాలి.

ప్రశ్న: మూసీ ఆయకట్టులో తాలు, నూక

ఎక్కువగా వస్తుంది. ఎలా అధిగమించాలి!

–పక్కీర్‌ యాదవరెడ్డి, నర్సిరెడ్డి,

మరికొందరు రైతులు, పోచంపల్లి మండలం

డీఏఓ: జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఆర్‌ఎన్‌ఆర్‌–29325, ఆర్‌ఎన్‌ ఆర్‌ –28361, జేజీఎల్‌–28369 వంటి దొడ్డు రకం వరి వంగడాలను అభివృద్ధి చేసింది.

ఇవి పొట్టిరకం విత్తనాలు. ఈ వంగడాలు సాగు చేస్తూ లాభసాటిగా ఉంటుంది. ఎకరాకు 32 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

ప్రశ్న: పత్తిలో హైబ్రిడ్‌ రకాలు వస్తున్నాయి. ఏరకం సీడ్‌ వేయాలి?

– భూదాన్‌పోచంపల్లి, రాజాపేట రైతులు

డీఏఓ: నిషేధిత హెచ్‌టీ పత్తి సీడ్‌ తప్పా ఏవైనా విత్తుకోవచ్చు. ముఖ్యంగా ఎల్‌బీనగర్‌ నుంచి తీసుకువచ్చే హెచ్‌టీకాటన్‌ విత్తనాలు ఎట్టి పరిస్థితిలో వేయొద్దు. లైసెన్స్‌డ్‌ డీలర్ల వద్ద మాత్రమే సీడ్‌ కొనుగోలు చేయాలి. తప్పనిసరిగా రశీదు పొంది పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలి. దిగుబడి రాకపోతే పరిహారం పొందటానికి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో రశీదు తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది. పత్తి విత్తనాలపై ప్రభుత్వ ఎలాంటి రాయితీ ఇవ్వలేదు.

విత్తన ఎంపికే కీలకం1
1/1

విత్తన ఎంపికే కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement