
నకిలీ ఇక్కత్ డిజైన్లను అరికట్టాలి
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ నకిలీ డిజైన్లను అరికట్టాలని కోరుతూ సోమవారం టై అండ్డై అసోసియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్ హైదరాబాద్లో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్రామ్ మాన్జీని కలిసి విన్నవించారు. హైదరాబాద్లోని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోచంపల్లి నుంచి భారత లవకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచంపల్లి చేనేత పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, చేనేత వ్యాపారులకు వ్యాపార స్థాపనకు ఆర్థిక సహకారం అందించాలని కేంద్రమంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయనను సన్మానించారు.
చికిత్స పొందుతున్న
వ్యక్తి మృతి
బొమ్మలరామారం: చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన బొమ్మలరామారం మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిల్లిగుండ్లతండాకు చెందిన దీరావత్ భాస్కర్ (35) అతడి భార్య లావణ్యతో కలసి గ్రామాల్లో ఆటోలో తిరుగుతూ ఉల్లిగడ్డ, ఎండు మిర్చి, అల్లం వెల్లుల్లి అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో వ్యాపారం సరిగా నడవక ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో భాస్కర్ మానసిక వేదనకు గురయ్యాడు. ఆటోలో వ్యాపారం నిమిత్తం ఆదివారం సిరిసిల్ల ప్రాంతానికి వెళ్లిన భాస్కర్ స్వగ్రామమైన పిల్లిగుండ్లతండాకు తిరిగి వచ్చాడు. మధ్యాహ్నం ఓ వ్యవసాయ బావి వద్ద గడ్డిమందు తాగి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న భాస్కర్ను గమనించి భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై నాగభూషణంచారి తెలిపారు.