
రైతుల సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారు
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారని, ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరి దోపిడీ వాళ్లదే అన్నట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు. సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని ఏపూరు గ్రామంలో ఐకేపీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఐకేపీ కేంద్రాల్లో రైతులు ధాన్యం తీసుకువచ్చి 60 రోజులు దాటుతున్నా కాంటాలు కాకపోవడం దారుణమన్నారు. రుతుపవనాలు వచ్చి దుక్కులు దున్నాల్సిన రైతులు ప్రతిరోజు ధాన్యం కుప్పల వద్ద కాపలా కాయాల్సి వస్తోందన్నారు. కాంటా అయిన తర్వాత కూడా మిల్లులో నిర్వాహకులు రైతులతో బేరమాడుతున్నారని, చివరికి రైతులు దళారుల కాళ్లు పట్టుకునే దుస్థితి దాపురించిందని, ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అని దుయ్యబట్టారు. ఐకేపీ కేంద్రాల్లో ప్రతిగింజనూ ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ నాయకత్వంలో చంద్రబాబు ఆడించినట్లు రేవంత్ ఆడుతున్నాడని, నదుల నీళ్లు దోపిడీకి గురవుతున్నా నోరు మెదపడం లేదని ఆరోపించారు. బనకచర్లతో గోదారి దోపిడీకి మరో కుట్ర జరుగుతోందని, మన జలాలను కాపాడుకునేందుకు రేవంత్ మొద్దునిద్ర వీడాలన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేమని కేసీఆర్ నాయకత్వంలో మరో ఉద్యమం తప్పదన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ ఉన్నారు.
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి