
విత్తన శుద్ధితో తెగుళ్ల నివారణ సులభం
పెద్దవూర: వివిధ పంటల్లో తొలి దశలో విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లు, రసం పీల్చే పురుగులను నియంత్రించడానికి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలని పెద్దవూర మండల వ్యవసాయశాఖ అధికారి పి. సందీప్కుమార్ సూచిస్తున్నారు. విత్తన శుద్దితో మొలక శాతం పెరగడంతో పాటు తొలుత 30 రోజుల వరకు పంట ఆరోగ్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వివిధ పంటల సాగులో విత్తన శుద్ది ఎలా చేయాలో ఆయన వివరించారు.
● వరి: కితో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజమ్ మందును కలిపి 24 గంటల తర్వాత నారు మడిలో చల్లుకోవాలి. దుంప నారు మడులకు అయితే లీటరు నీటికి 1గ్రాము కార్బండిజమ్ మందును కలిపి ఈ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టాలి. మండె కట్టి మొలకెత్తిన విత్తనాన్ని నారుమడిలో చల్లుకోవాలి.
● సోయాబీన్: కిలో విత్తనాలకు 2 గ్రాముల థైరమ్+1 గ్రాము కార్బండిజమ్ కలిపి, 1.5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్తో విత్తన శుద్ధి చేయాలి. చివరగా విత్తే గంట ముందు 10 కిలోల విత్తనాలకు 200 గ్రాముల రైజోబియం జపానీకం కల్చర్ను నీరు, జిగురుతో పట్టించి నీడలో ఆరబెట్టాలి.
● జొన్న: కిలో విత్తనానికి 3 గ్రాముల థెరమ్ లేదా కాప్టాన్ మందును కలిపి శుద్ధి చేయాలి. మొవ్వ ఈగ నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల థమోమిఽథాక్సమ్ మందును కలపాలి.
● మొక్కజొన్న: కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెట్ లేదా థెరమ్ లేదా కాప్టాన్తో శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు.
● కంది: కందిలో విత్తనం ద్వారా సంక్రమించే ఎండు తెగులును నివారించడానికి తెగులును తట్టుకునే రకాలను సాగు చేయడంతో పాటు 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడే కలిపి శుద్ధి చేసుకోవాలి.
● పత్తి: పత్తిలో రసంపీల్చు పురుగుల తాకిడి ఎక్కువ. బీటీ పత్తిని పండిస్తున్న రైతులు కూడా పిండి నల్లి, నులి పురుగులతో ఇబ్బందులు పడుతున్నారు. వీటి నివారణకు కిలో విత్తనానికి తగినంత జిగురు కలిపి 9 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్ లేక 5 గ్రాముల థయోమిథాక్సమ్ 70డబ్ల్యూపీఎస్. 2 గ్రాముల కార్బండిజమ్తో విత్తన శుద్ధి చేయాలి.
మిరప: మిరప విత్తన శుద్ధి చేయడానికి మొదట విత్తనాలను 15–20 నిమిషాల పాటు గోరు వెచ్చని నీటిలో నానబెట్టాలి. తర్వాత ఒక లీటరు నీటిలో 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ను కరిగించి ఆ ద్రావణంలో విత్తనాలను 15–20 నిమిషాల పాటు నానబెట్టాలి.
ఫ పెద్దవూర మండల
వ్యవసాయాధికారి సందీప్కుమార్
పసుపు: పసుపు పంటను దుంప వేరు కుళ్లు, ఆకుపచ్చ తెగుళ్ల నుంచి కాపాడుకునేందుకు లీటరు నీటికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 3 గ్రాముల మెటలాక్సీస్ ఎంజెడ్ కలిపి ఆ ద్రావణంలో 40 నిమిషాల సేపు కొమ్ములను ఉంచాలి. అనంతరం నీడలో ఆరబెట్టాలి. పసుపు కొమ్ము/విత్తనాలకు పొలుసు పురుగు ఆశిస్తే శిలీంధ్రనాశినితో పాటు లీటరు నీటికి 5 మిల్లీ లీటర్ల మలాథియాన్, 2 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపి నీడలో ఆరబెట్టి నీరు మార్చి 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడే కలిపిన ద్రావణంలో ముంచి కొమ్ములను నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

విత్తన శుద్ధితో తెగుళ్ల నివారణ సులభం