
పర్యాటకులకు రక్షణ కల్పించడంలో కేంద్రం విఫలం
ఆలేరు: కశ్మీర్లో పర్యాటకులకు రక్షణ కల్పిచండంలో కేంద్ర ప్రభుత్వ పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) జాతీయ నాయకురాలు వి. సంధ్య ఆరోపించారు. పహల్గాం ఘటన, ఆపరేషన్ సింధూర్లో దాగిన నిజాలు, ఆపరేషన్ కగార్ను ఆపాలనే అంశాలపై ఆదివారం ఆలేరు పట్టణంలో జరిగిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. పహల్గాంలో పర్యాటకులను చంపిన ఉగ్రవాదులు దేశం దాటి వెళ్తుంటే రక్షణ శాఖ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ వల్ల పాలకవర్గాలకు ప్రయోజనం తప్ప.. ప్రజలకు, భారత్, పాకిస్తాన్ దేశాలకు ఏమీ లాభం లేదన్నారు. మనకంటే ముందే ఆపరేషన్ సింధూర్ ఆగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం మన దేశ ఆత్మగౌరవాన్ని అమెరికా ముందు తాకట్టు పెట్టడం కాదా అని ప్రశ్నించారు. ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు. చర్చలకు సిద్ధమని ప్రకటించిన మావోయిస్టు పార్టీలతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. మావోయిస్టుల పేరుతో గిరిజనులు, ఆదివాసులను చంపడాన్ని ఆపాలన్నారు. మోదీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సిద్ధం కావాలని సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి, సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి ఆర్. జనార్దన్, సీపీఐ జిల్లా కార్యదర్శులు గోద శ్రీరాములు, జహంగీర్, జిల్లా నాయకులు మామిడాల సోమయ్య, ఆర్. సీత తదితరులు పాల్గొన్నారు.
ఫ మావోయిస్టు పార్టీలతో చర్చలు జరపాలి
ఫ పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్య