
నూతన సాంకేతిక పద్ధతులు పాటించాలి
గరిడేపల్లి: పంటల సాగులో రైతులు నూతన సాంకేతిక పద్ధతులు పాటించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ – అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐసీఏఆర్–ఏటీఏఆర్ఐ), హైదరాబాద్ డైరెక్టర్ షేక్ ఎన్. మీరా అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తిసాగుపై ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం వలన రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుందని వివరించారు. రైతులు తాము పండించిన ఉత్పత్తులు స్థానిక మార్కెట్లో విక్రయించే బదులు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్పీఓ) ద్వారా ఎగుమతి చేయాలని అన్నారు. చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు, పెరటికోళ్ల పెంపకం ద్వారా గ్రామీణ మహిళలు ఉపాధి పొందవచ్చని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి వాతావరణాన్ని తట్టుకునే పంటల వైపు రైతులు మళ్లాలని అన్నారు. అనంతరం రైతులకు డ్రమ్ సీడర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, వర్మీ బెడ్లను అందజేశారు. కార్యక్రమంలో కేవీకే ఇన్చార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డి. నరేష్, ఎస్ఏఐఆర్డీ కేవీకే సెక్రటరీ స్నేహలత, కేవీకే శాస్త్రవేత్తలు నరేష్, కిరణ్, మాధురి, ఆదర్శ్, సుగంధి, నరేష్, సైదులు, ఉపేందర్, రైతులు పాల్గొన్నారు.
ఐసీఏఆర్–ఏటీఏఆర్ఐ, హైదరాబాద్
డైరెక్టర్ షేక్ ఎన్. మీరా