బైక్‌ అదుపుతప్పి హెడ్‌కానిస్టేబుల్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపుతప్పి హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

Jun 4 2025 2:24 AM | Updated on Jun 4 2025 2:24 AM

బైక్‌ అదుపుతప్పి  హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

బైక్‌ అదుపుతప్పి హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

కనగల్‌: విధి నిర్వహణలో భాగంగా బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి కిందపడి హెడ్‌కానిస్టేబుల్‌ మృతిచెందాడు. ఈ ఘటన కనగల్‌ మండలం దర్వేశిపురం సమీపంలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బొల్లేపల్లి సైదులు(47) విధి నిర్వహణలో భాగంగా మంగళవారం ఉదయం జి. చెన్నారం గ్రామంలో పిటిషన్‌ ఎంకై ్వరీ పూర్తిచేసి తిరిగి బైక్‌పై పోలీస్‌ స్టేషన్‌కు వస్తుండగా.. మార్గమధ్యలో దర్వేశిపురం గ్రామ సమీపంలోని జీఎల్‌ గార్డెన్స్‌ వద్ద బైక్‌ అదుపుతప్పడంతో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. మరో కానిస్టేబుల్‌ రవీందర్‌రెడ్డి గమనించి సైదులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, 108 వాహనంలో సైదులును నల్లగొండ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

గేదెను ఢీకొని..

గరిడేపల్లి: బైక్‌పై వెళ్తున్న యువకుడు గేదెను ఢీకొట్టి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామ శివారులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదండరాంపురం గ్రామానికి చెందిన మచ్చ మహేష్‌(32) పని నిమిత్తం సోమవారం మఠంపల్లి మండలంలో పెదవీడు గ్రామంలో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. రాత్రి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామ శివారులోని రైస్‌ మిల్లు వద్ద గేదెను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సందీప్‌ తలకు తీవ్ర గాయాలై స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు అతడిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

తుంగతుర్తి: తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటన తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. గానుగుబండ గ్రామానికి చెందిన గీత కార్మికుడు పంజాల సోమయ్య రోజుమాదిరిగా సోమవారం సాయంత్రం గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి జారి కిందపడ్డాడు. దీంతో అతడి నడుము, వెన్నుపూస, చెయ్యి విరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సోమయ్యను ఆస్పత్రిలో బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు గుండగాని రాములుగౌడ్‌, గుండగాని కిరణ్‌గౌడ్‌ పరామర్శించారు.

జూదరులు అరెస్ట్‌

తిరుమలగిరి(నాగార్జునసాగర్‌): పేకాట ఆడుతున్న నలుగురు జూదరులను మంగళవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ వీరశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి(సాగర్‌) మండల కేంద్రంలోని సందీప్‌ ఫాస్ట్‌పుడ్‌ సెంటర్‌లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా.. రంగుండ్ల గ్రామానికి చెందిన ఆంగోతు శ్రవణ్‌, ఆంగోతు సందీప్‌, మేరావత్‌ దస్రూ, ఆంగోతు కిషన్‌ పట్టుబడ్డారు. వారి నుంచి రూ.4270 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మిర్యాలగూడ మండలంలో..

మిర్యాలగూడ టౌన్‌: మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ శివారులోని రాజీవ్‌ నగర్‌ గుబ్లీ కాలనీలో పేకాట ఆడుతున్న 8 మందిని సోమవారం రాత్రి మిర్యాలగూడ రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.7600 నగదు, మూడు సెల్‌ఫోన్లు, ఒక బైక్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement