
30ఏళ్ల కల సాకారం కాబోతోంది
సాక్షి, యాదాద్రి: ఆలేరు నియోజకవర్గ ప్రజల 30ఏళ్ల కలను సీఎం రేవంత్రెడ్డి సాకారం చేయబోతున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలం తిర్మలాపురం వద్ద 6వ తేదీన నిర్వహించనున్న సీఎం బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం వారు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రూ.1,500 కోట్లతో ఆలేరు నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి 6న శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా గంధమల్ల రిజర్వాయర్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యాదాద్రి మెడికల్ కళాశాల, వేద పాఠశాల, ధాన్యం గోదాములు, మోటకొండూరులో పోలీస్ స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయ భవనాలకు భూమి పూజ చేస్తారన్నారు. అదేవిధంగా పలు రోడ్లు, కొలనుపాక, పొట్టి మర్రివద్ద హైలెవల్ బ్రిడ్జిలకు శంకుస్థాపన చేస్తారన్నారు. గంధమల రిజర్వాయర్తో ఆలేరు ప్రాంతం సస్యశ్యామలం కానుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలేరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఆలేరుకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. మూసీ ప్రక్షాళనతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. సీఎం బహిరంగ సభకు రైతులు, యువకులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గంధమల్ల రిజర్వాయర్తో ఆలేరు సస్యశ్యామలం
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి