
పోగొట్టుకున్న సెల్ఫోన్ బాధితుడికి అప్పగింత
దేవరకొండ: దేవరకొండ ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం ప్రయాణికుడు పోగొట్టుకున్న సెల్ఫోన్ను ఆర్టీసీ అధికారులు తిరిగి అతడికి అప్పగించారు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన సుబ్బారావు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దేవరకొండకు వచ్చాడు. అక్కడ పని ముగించుకుని నల్లగొండకు వెళ్లేందుకు గాను దేవరకొండ బస్టాండ్లో బస్సు ఎక్కాడు. ఈ క్రమంలో తన రూ.30వేల విలువైన సెల్ఫోన్ను పోగొట్టుకున్నాడు. దేవరకొండ బస్టాండ్లో స్వీపర్గా పనిచేస్తున్న ముత్తమ్మకు ఆ ఫోన్ దొరకడంతో ఆమె డిపో అధికారులకు అందించింది. డిపో అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు ఫోన్ నంబర్ ఆధారంగా వివరాలు సేకరించి సుబ్బారావుకు సెల్ఫోన్ అప్పగించారు. నిజాయితీ చాటుకున్న ముత్తమ్మను ఆర్టీసీ అధికారులు అభినందించారు.