
దాతలూ.. సాయం చేయరూ..
మర్రిగూడ: కూలీ పనులు చేసుకుంటూ ఉన్నంతలో తృప్తిగా బతుకుతున్న ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. కుమారుడికి తలసేమియా వ్యాధి సోకడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం స్థితిగతులు చిన్నాభిన్నమయ్యాయి. వివరాలు.. మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన బల్లెం అబ్బయ్య, స్వరూప దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు బల్లెం ప్రణయ్ గతేడాది వినాయక నిమజ్జనం రోజు నీరసించడంతో తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా తలసేమియా వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. తలసేమియా సోకిన రోగికి 15 రోజులకొకసారి కొత్త రక్తం ఎక్కించాలి. ప్రణయ్కి తలసేమియా వ్యాధి సోకినట్లు తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు వైద్య పరీక్షలు, మందులు 70 ప్యాకెట్ల రక్తం ఎక్కించినందుకుగాను రూ.5లక్షల వరకు ఖర్చు చేశారు.
బైక్, బంగారం అమ్మి..
కూలీ పనులకు వెళ్తే వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో అబ్బయ్య తన బైక్, స్వరూప తన బంగారాన్ని అమ్మి మరీ ప్రణయ్కి వైద్యం చేయించారు. గ్రామానికి చెందిన పలువురు రూ.లక్ష వరకు, సమీప బంధువులు రూ.50వేల వరకు ఆర్ధికసాయం అందజేశారు. అంతేకాకుండా అప్పులు తెచ్చి కూడా తెచ్చారు. ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేకపోవడంతో కిరాయి ఇంట్లో నివాసముంటున్నారు.
దాతలు దయతలిస్తేనే...
హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో ప్రణయ్కి వైద్య సేవలు అందుతున్నప్పటికీ.. సమయానికి రక్తం, మందులు లభించకపోవడంతో ప్రైవేట్గా కొనుగోలు చేయాల్సి వస్తుందని అబ్బయ్య, స్వరూప వాపోతున్నారు. ఆపరేషన్కు రూ.25లక్షలు అవసరమని అందులో రూ.20లక్షలు ప్రభుత్వం సహకరిస్తే.. మరో రూ.5లక్షల కోసం దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. దయార్ధ హృదయులు సాయం చేసి తమ కుమారుడి ప్రాణాలు కాపాడాలని అబ్బయ్య, స్వరూప కోరుతున్నారు.
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న 11ఏళ్ల బాలుడు
రూ.5లక్షల వరకు ఖర్చు చేసిన
తల్లిదండ్రులు
ఆపరేషన్కు రూ.25లక్షలు అవసరం

దాతలూ.. సాయం చేయరూ..